20, ఫిబ్రవరి 2021, శనివారం

పూజాఫలం సినిమా - నిన్నలేని అందమేదో | తెలుగు పాత పాటలు విశ్లేషణ | Telugu old songs

పాటలో ఏముంది ?

ఏనాడూ కనీవినీ ఎరుగనివీ ఎన్నడూ కలగననివీ అలా ఏవేవో  ఉన్నట్లుండి , కళ్లముందు కొత్త కొత్తగా కదులడం మొదలెడితే ఏమనుకోవాలి ? నిజానికి అవేవీ అంతకు ముందు ఉనికిలో లేనివి కావు . అప్పుడే కొత్తగా వచ్చి పడినవీ కావు కాకపోతే ఇన్నేళ్లూ మన మనసు వాటిని చూసే స్థితిలో లేదు కారణం ఏదైతేనేమిటిలే గానీ , ఉన్నట్లుండి ఒక్కోసారి గుండెలో ఎప్పటినుంచో మకాం వేసి ఉన్న అలజడీ ఆందోళనా మటుమాయమైపోతాయి . మనసు నందనవనంగా మారిపోతుంది . మనసుకు వేయి కళ్లు పుట్టుకొస్తాయి . గుండె పులకించిపోతుంది . ప్రకృతి ఎన్నడూ లేనంత మనోహరంగా దర్శనమిస్తుంది  . 1964 లో విడుదలైన పూజాఫలం సినిమా కోసం
డాక్టర్ సి . నారాయణ రెడ్డి రాసిన ఈ పాటలో పరవశాల హరివిల్లే కనిపిస్తుంది . సాలూరు రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో గండుకోకిల ఘంటసాల పాడిన ఈ పాటను ఎన్ని సార్లు విన్నా తక్కువే !

నిన్నలేని అందమేదో !!




నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో 
నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో ... తీగ సాగెనెందుకో
నాలో .... నిన్నలేని అందమేదో
కళ్ల ముందు కదలాడే కమనీయ సౌందర్యాలన్నీ కొత్తగా పుట్టకొచ్చినవేమీ కాదు ఇన్నేళ్లూ నీలో ఉన్నవే . నీతో ఉన్నవే ! గమనించం కానీ , మనసు నిలిపితే లోకం ముగ్ధ మనోహరమే! నిర్మలమైన భావనాలోకంలో ప్రతిదీ కొత్తగానే కనిపిస్తుంది ప్రతి కొమ్మా , ప్రతి తీగా కొత్త పెళ్లి కూతురులాగే కనిపిస్తుంది . ప్రకృతీ దేవి ఒడిలో ఓలలాడుతున్నట్లే అనిపిస్తుంది . రాగఝురుల్లో స్నానమాడుతున్నట్లే ఉంటుంది . రాగమంటే సాగదీసిన శబ్దం కాదు కదా !
అదొక భావోద్వేగాల వెల్లువ . అయితే ఈ భావోద్వేగాల మూలం బయటెక్కడో ఉన్నట్లు ముందు అనిపిస్తుంది . కానీ, ఆ తర్వాత అది బయటిదేమీ కాదు దాని మూలం తనలోనే ఉందని తొందరలోనే తెలిసిపోతుంది .

పూచిన ప్రతి తరువొక వధువు - పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగెనో ...../ నిన్నలేని /
పూలు పూసే వయసొచ్చిన మొక్క పెళ్లి కూతురుకన్నా ఏం తక్కువ ? ఆ పెళ్లి కూతురు పంచే పూదెనె ఏం తక్కువ ? అవేమీ తక్కువ కాదు . వాస్తవం ఏమంటే , తన మనసు ఆ వైపు వెళ్లిందే చాలా తక్కువ . ఎందుకంటే , మనిషికి మనుషుల్ని చూడటమే ఎక్కువైపోయింది . మనిషే సమస్తం అయినట్టు . మనిషే సర్వసమగ్రం అయినట్లు ఎంత సేపూ అతని చుట్టే తిరుగడం ఎక్కువైపోయింది . మనిషి ఇతర జీవరాశుల్లో కెల్లా గొప్పే కావచ్చు . కానీ , ఆ మాటకొస్తే , సమస్త జీవకోటికీ ప్రాణదానం చేసిన ప్రకృతి మనిషి కన్నా ఎన్ని కోట్ల రెట్లు ఎక్కువ ? అయినా మనిషి దాని పైకి ఏపాటి దృష్టి సారిస్తున్నాడు ? ఎప్పుడో ఏ ఏడాదికో ఒకసారి కొందరి మనసు ఆ వైపు కాస్త వెళుతుందేమో !
కొందరైతే తమ జీవన పోరాటంలో పడి మొత్తంగా తమ జీవితకాలంలోనే ఒకసారైనా ఆ వైపు తేరిపార చూడటం జరగదు . అలాంటి వారు అనుకోకుండా ఎప్పుడో ఆ వైపు దృష్టి పెడితే ఎలా ఉంటుంది ? అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది . అన్నీ అప్పుడే పురివిప్పినట్లు , కోయిల తొలిసారిగా అప్పుడే గొంతు విప్పినట్లు అనిపిస్తాయి . పూల సోయగాలు , పూతేనియల మాధుర్యాలు తొలిసారి తెలిసి వస్తాయి ? నిత్యమూ శోభిల్లే ప్రకృతి సౌందర్యాలు ఆ రోజే తొలిసారి తెలిసొస్తాయి .

తెలినురుగులె నవ్వులు కాగా ...సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే / నిన్నలేని /
లోకంలో గలగలమని నవ్వేది , హొయలూ , ఒయ్యారాలు పోయేది మనుషులేనా ? ఇవేవీ మనిషి సొత్తేమీ కాదు . వీటిపైన మానవాళి గుత్తా దిపత్యం ఏమీ లేదు నదీ ప్రవాహంలో వచ్చే చిక్కని నురగలు నవ్వుల్లా అనిపించవా? వంకులు తిరుగుతూ పయనించే సెలయేరు నడకల్లో ఒయ్యారాలు కనిపించవా ? అనిపించకపోవచ్చు . కనిపించకపోవచ్చు . ఎందుకంటే చాలా మందికి మొత్తం తమ జీవిత కాలంలో మనిషుల్ని చూడటం ఒక్కటే తెలిసింది . అంతేగానీ , చెట్టూ , చేలూ , పుట్టా , గుట్టా , అరణ్యాలూ , మేఘాలూ , నమస్త సృష్టినీ చుట్టేస్తూ , హోరెత్తిపోయే గాలి నాదంలో ఎవరికీ రాగలయలు వినిపించవు . కనిపించని కోటి వీణల స్వరనాదాలు వినిపించవు . అలాగని అసలే వినిపించవని కూడా కాదు . వినిపిస్తాయి . కానీ , వాటిని అవేవో శబ్దాలు అనుకుంటారే గానీ జీవన రాగాలని గమనించలేరు . ఎప్పటికీ అంతేనా ? అంటే అలా ఏమీ కాదు .... మనసు కళ్లు తెరిస్తే , హృదయ కర్ణాలు విచ్చుకుంటే అవన్నీ వినిపిస్తాయి , కనిపిస్తాయి .

పసిడియంచు పైటజారా పయనించే మేఘబాలా
అరుణకాంతి సోకగానే పరశించెనే / నిన్నలేని /
పొద్దు పొద్దున్నే మేఘ బాలికలు సూర్యుడికి స్వాగతం పలకడానికి బంగారు అంచు పైటలతో వేచిచూస్తుంటాయి . అయినా , ఎవరూ వాటిని గమనించరెండుకని ? సూర్యుని తొలి కిరణాలు ఎడీపడగానే మేఘాలు పరవశించిపోవడాన్ని మనుషులు గమనించడమే లేదు .   సమస్య ఏమిటంటే ,అయితే వారు అసలు గమనించడం లేదు అని చెప్పలేం . అణువణువునా అన్నీ గమనిస్తున్నారనీ చెప్పలేం . కానీ , చాలా మంది చూసీ చూడనట్లు , గమనించీ గమనించనట్లు ఉండిపోతున్నారు . ఎందుకంటే , జీవితాలు మందగమనంతో సాగిపోతున్నట్లు , హృదయాలు కూడా మంద్రస్పందనలతో ఉండిపోతున్నాయి . ఈ మందగమనం పోయి శరవేగాన్ని పుంజుకోవాలన్నా , జడత్వం పోయి జవజీవాలు నింపుకోవాలన్నా కొన్ని జరగాలి . వేయి సూర్యుల వేడి , వేయి చంద్రుల చల్లదనం మనిషిని తాకాలి . అతని మనసును తాకాలి . వాస్తవానికి అనాదిగా రస హృదయులంతా , రసాత్మక జీవులంతా అదేపనిగా ఇదే కోరుకుంటున్నారు . అయితే వారి లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది . ఎదురు చూడాలి !! మానవ హృదయాలు మయూరాల్లా ఎప్పుడు పరివిప్పి నాట్యమాడతాయో నిరంతరం నిరీక్షించాలి !!

                                                                   -బమ్మెర

9 కామెంట్‌లు:

  1. Excellent song with an excellent interpretation, thanks and congratulations

    రిప్లయితొలగించండి
  2. Excellent lyric interpretation sir..After so many years also they are worth ..really golden songs..

    రిప్లయితొలగించండి
  3. ఈ పాట అద్బుతం మీ రాత ఇంకా అద్బుతం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దన్యవాదలు శ్రీనివాస్ గారు , మరిన్ని అద్బుతల కోసం , పాటల విశ్లేషణ చదువుతు ఉండండి - నవీన్ technician

      తొలగించండి
  4. పాట లోని సాహిత్యం దానికి మీరు అందించిన వర్ణన..చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. చాలా చక్కని వినసొంపైన పాట

    రిప్లయితొలగించండి