6, మార్చి 2021, శనివారం

చిత్రం : తెనాలి రామకృష్ణ | గానం : ఘంటసాల | సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ రామ్మూర్తి

 చిత్రం : తెనాలి రామకృష్ణ
చమత్కారం : తెనాలి రామలింగడు
గానం : ఘంటసాల
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ రామ్మూర్తి

   పెదవులు కదిపి చూడండి!

‘‘అయ్యా! తమకు అంతటితోనే జయపత్రిక అందదు’’ అన్నాడు తెనాలి రామకృష్ణుడు.

అది రాయలవారి భువనవిజయం. అక్కడ అష్టదిగ్గజ కవులున్నారు. తాతాచార్యుల వంటి వేదాంతాది శాస్త్రపండితులున్నారు. ఎంతమంది వున్నాగడ్డు సమస్యలు వచ్చినప్పుడు అడ్డుపడేవాడు రామకృష్ణుడే.

సాక్షాత్తూ తాతాచార్యుల శిష్యుడే ఓ సందర్భంలో... ‘మతవిషయకమైన చర్చ వచ్చినట్లయితే మా గురువుగారు మాడు వాయగొట్టేవారే. కానీ ఇది వ్యాకరణం అయిపోయింది’ అంటాడో సందర్భంలో. అటువంటిది రామకృష్ణుడు సభలోనే ఉన్నప్పుడు వైరిపక్షం వారికి గెలుపు అంత తేలిగ్గా దక్కనిస్తాడా? అడ్డు పడనే పడ్డాడు.

వచ్చినవాడు సహస్రఘంటకవి నరసరాజు. ‘పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తాను. పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి విజయపత్రిక కటాక్షించండి’ అంటూ భువనవిజయంలో కాలుపెట్టాడు.
ముందుగా ఘంటం పడతానని పరీక్షకు కూర్చున్న అతగాడిని.... కుటిలోపాయాలు తెలియని తేటతెల్లపు కవి అయిన ధూర్జటి.... కొంచెం పరీక్షించాడు కానీ, లాభం లేకపోయింది. చెప్పింది చెప్పినట్లు నరసరాజు రాయనే రాసేశాడు.

అప్పుడన్నాడు రామకృష్ణుడు. ‘తమకు అంతటితోనే జయపత్రిక అందదు’ అని.

‘మరో శారదామూర్తి అందుకోవచ్చు’ అని నరసరాజు సవాలు విసిరాడు.

‘నేను అందుకుంటున్నాను రాయండి’ అంటూ తెనాలి రామకృష్ణుడు ఆదిలోనే హంసపాదు పడేలా మారుమోగేలాంటి పద్యం చెప్పాడు.వేగంగా రాస్తాను అన్నవాణ్ణి ఎక్కడో చివర్లో ఆపడం కాకుండా... మొదటి
మాటతోనే నిలిపేశాడు.

తృవ్వట! బాబా; తలపై
పువ్వట! జాబిల్లి; వల్వబూదట! చేదే
బువ్వట! చూడగ నుళుళుక్
అవ్వట; అరయంగ నట్టి హరునకు జేజే!


బాబా అంటే వాహనం. ఇకరామకృష్ణుడు మొదటిగా చేసిన శబ్దం.... తృవ్ హెహె అని ఎద్దును అదిలిస్తారు కదా అది. మొత్తంమీద ఎద్దును వాహనంగా కలవాడు అని అర్థం. జాబిల్లిని తలమీద పువ్వులాగా పెట్టుకున్నవాడు శివుడే కదా! ఆయనకు అవ్వ అంటే తల్లి హుళక్కి.... లేదు! తల్లిదండ్రులు లేకుండా పుట్టినవాడని అర్థం. అటువంటి శివునికి జేజేలు చెబుతున్నాడు కవి.

ఇది కందపద్యం. ఒక్కసారి ఈ పద్యానికి ఘంటసాల గానాన్ని, అక్కినేని అభినయాన్ని జాగ్రత్తగా మరోసారి పరికించండి. నోరారా మీరు పలికి చూడండి. తృవ్ అని మీ చిన్నారుల చేత పలికిస్తూ ఈ పద్యాన్ని నేర్పించండి. వారికి ఆటగా ఉంటుంది. పైగా భావమేమో శివునికి నమస్కారం అని. కాబట్టి రెండిందాలా లాభం.

మనమైతే తృవ్ అని రాసేసుకున్నాం కానీ, అలా రాసి సరిపెట్టుకోవడానికి నరసరాజుకు తోచలేదు. పాపం తెనాలి రామకృష్ణుని చేత ముక్కచివాట్లు తిన్నాడు.

తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
బలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వా
రల నిరసింతువా ప్రగడరాన్నరసా విరసా తుసా భుసా

వార్నీ! కవులకు మరీ ఇంతటి అహంకారమా? ఏదోపాపం రాస్తానన్నవాడు రాయలేకపోతే ఇంతమరీ చెడతిట్టాలా? అనుకోవాల్సిన పనిలేదు. నీకు రాయడం కూడా రాదని రామలింగడు వాడినక్కడే ఆపకపోయి వుంటే... అతగాడు తరువాత చేస్తానన్న పనేమిటి... పెద్దల కవితల్లో తప్పులు పడతానని. ఈ పని మనలో పెద్దపెద్దవాళ్లం అనిపించుకున్నవాళ్లం కూడా నిత్యం చేసేస్తూనే ఉన్నాం. ఆ సమయంలో ఈ పద్యం ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది.

‘ఓయి కవి నరసా... నీవు చేసేదంతా విరసమే. బుస్సుబుస్సులు తప్ప ఏమున్నది నీలో?! ఈపాటి పద్యమే వ్రాయలేక నీ పనితనమంతా తుస్సా... ఇక దయచేయి. ఒళ్లు దగ్గరపెట్టుకో!’.... అనడానికి ముందు ఇంకా భయంకరమైన తిట్లు తిట్టాడు.

ఆర్యవ్యవహారంబులు అదుష్టంబులు గ్రాహ్యంబులు... అన్నాడు చిన్నయసూరి. పెద్దలు కవితాత్మకంగా కానీ, సందేశాత్మకంగా కానీ ఏదైనా ప్రయోగం చేస్తే దానిలో ఎంతో లోతైన అర్థం ఉంటుంది. దానిని దుష్టప్రయోగంగా అనుకోకూడదు. యధాతథంగా తీసుకుని మననం చేసుకునే కొద్దీ కవిభావమేదో తెలుస్తుంది. ఆ ప్రయత్నం చేద్దాం.
- నేతి సూర్యనారాయణశర్మ
శంకరవిజయం నవలా రచయిత

1 కామెంట్‌: