18, మార్చి 2022, శుక్రవారం

పాలకడలివంటి పాండ వాగ్రజు మదిన్‌ పద్యం | వీరాభిమన్యు సినిమా పద్యాలు | తెలుగు పద్యాలు | ఘంటసాల పద్యాలు |

పద్య మాధురి

సంకల్పమే ... మహా సమర శక్తి

రాయబారిగా వచ్చిన కృష్ణుడు, పాండవులకు అర్దరాజ్యం ఇవ్వకున్నా, ఐదూళ్లయినా ఇవ్వమని కోరినప్పుడు, దుర్యోధనుడు ఎంత హేళనగా మాట్లాడాడు? దయ తలచి, పాండవులను ప్రాణాలతో వదిలేసినందుకు అదే మహా భాగ్యమనుకుని సంబరపడకుండా, రాజ్యంలో భాగమివ్వమని అడుగుతారా? పెద్దమనిషివని ఏదో ఆహ్వానం పంపితే  కృష్ణా! ఈ మతితప్పిన మాటలేమిటి? అంటూ కృష్ణుణ్ని చులకన చేసి మాట్లాడాడు. అయితే, అందుకు కృష్ణుడు బాధపడిందేమీ లేదు. ఎందుకంటే వారి సంస్కార స్థాయి ఏమిటో కృష్డుడికి తెలియనిదేమీ కాదు. అన్నీ తెలిసి  తెలిసే ఆ రాయబారానికి పూనుకున్నాడు. ఆయా వ్యక్తుల స్వభావాలూ, ప్రవర్తనలు ఎలా ఉన్నా, రాయబారిగా వెళ్లినప్పుడు చెప్పవలసినవన్నీ చెప్పాల్సిందేగా! ఒక వ్యవహార విధానంగా ఆ ప్రస్థావన తేవడమే తప్ప,  ఐదూళ్లు కాదు దుర్యోధనుడు ఐదడుగుల  స్థలం కూడా ఇవ్వడన్న నిజం కృష్ణునికి తెలియనిదేమీ కాదు. అలాగని, రాయబార విషయాలను మతితప్పిన మాటలంటూ ఎద్దేవా చేసిన దుర్యోధనుడి అహంకారానికి, సరిధీటు సమాదానం చెప్పకుండా కృష్టుడు ఏమీ వదల్లేదు ..
1965లో విడుదలైన ’వీరాభిమన్యు’ సినిమా కోసం సీనియర్‌ సముద్రాల రాసిన ఈ పద్యాన్ని కె. వి. మహాదేవన్‌ సంగీత సారధ్యంలో ఘంటసాల మృదుగంభీరంగా గానం చే శాడు. ఎవరికి వారు విని తరించాల్సిందే తప్ప,  ఆస్వాదించే మరో మార్గం లేదు మరి! ఇంతకూ కృష్ణుడు ఏమన్నాడు? 

పాలకడలివంటి పాండ వాగ్రజు మదిన్‌

       కోపాగ్ని రగిలి భగ్గుమనునాడు

గంధ గజేంద్రమ్ము  కరణి భీముడు నిన్ను

       నీ సహోదరుల మ్రదించునాడు

పరమేశునోర్చిన పార్థుడు గాండీవ

       మంది కర్ణుని దునుమాడునాడు

మాయారణ విదుండు మా ఘటోద్గజుడు నీ 

       బలగమ్ము గంగలో కలుపునాడు


ఎదిరి గెలువంగ నేర్తురే ఇందరేల

అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యుడు 

ఒక్కడే చాలు సంగరమోర్చి గెలువ

ఈ మహావీరులందెవ్వరేని అడ్డు

రారు, నిను గావగా లేరు, రాజరాజా 

నీ బలాన్నీ బలగాన్నీ చూసుకుని విర్రవీగుతున్నావు గానీ ... ధుర్యోదనా! నువ్వు చివరికి ఏమైపోతావో నీకేమైనా అంచనా ఉందా? అంటూ నిలదీశాడు కృష్ణుడు.  నీకు తెలియనిదేమీ కాదు ఎప్పుడూ పాలసముద్రంలా ప్రశాంతంగా ఉండే వారికే కనక రాకరాక కోసం వస్తే పరిణామాలు పరమ భయంకరంగా ఉంటాయి. ఆ పరమ శాంత మూర్తి ధర్మజుడే ఆగ్రహానికి గురైననాడు నీ గతీ మహా దారుణంగా ఉంటుంది. ధర్మజుడు ఒక్కడే కాదుగా! భీముడు, అర్జునుడు, ఘటోద్గజుడు యుద్దభూమిలో అరివీర భయంకరులే అవుతారు. అయినా .... వాళ్లంతా ఎందుకు? రణరంగంలో నిన్ను రక్తపు మడుగులో దొర్లించడానికి ఒక్క అభిమన్యుడు చాలు.దుర్యోధనా! భ్రమలు వీడి  వాస్తవాల్లోకి రా! అది నీకూ ... నీ బలగానికీ క్షేమదాయకం అంటాడు కృష్ణుడు.

ఎంతో మందికి కలిగే ధర్మసందేహం ఇక్కడ  ఒకటుంది. యుధ్ధరీతుల్లో అతి కీలకమైన పద్యవ్యూహంలోకి వెళ్లడమే గానీ, మళ్లీ బయటికి వచ్చే విద్య అభిమన్యుడికి తెలియదు కదా! అయినా కృష్ణుడు అభిమన్యుడి విషయంలో అంత ధీమాగా ఎందుకు మాట్లాడినట్లు అనిపించవచ్చు. అయితే, సర్వజ్ఞుడు  కదా కృష్ణుడు ...అవన్నీ తెలియకుండా ఎందుకు మాట్లాడతాడు? సాధ్యాసాధ్యాల గురించిన సత్యాలు ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియవు మరి! అందుకే ఆ ధీమా! లోకాన కొన్నింటిలో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో ముందే తెలిసిపోతుంది. అయితే, ఒక్కోసారి అప్పటిదాకా అసాధ్యమైనవిగా అనిపించినవే అనూహ్యంగా సాధ్యమవుతుంటాయి. ఒకవేళ  అసాధ్యమని ముందే తెలిసినా, ఒక్కోసారి తెగించి రంగంలోకి దూకడమే తప్ప మరో దారి కనిపించదు. అలాంటప్పుడు మనిషి మేదోశక్తి వేయింతలు  శక్తివంతంగా పనిచే స్తుంది. అనివార్యమైన  తన సంకల్ప బలం, తన ఆత్మశక్తి , ఆత్మవిశ్వాసం అప్పటిదాకా తనను నిర్భంధించిన పరిమితుల్ని చేధిస్తుంది. అవరోధాల్ని అధిగమిస్తుంది. ఆత్మ విశ్వాసం ఒక దశలో  మనిషికి  పైకి కనిపించని వేయి చేతులనిస్తుంది. వే యి గుండెలు మొలిపిస్తుంది. ఫలితంగా అప్పటిదాకా అసాధ్యంగా, అసంభవంగా అనిపించినవే సాధ్యమై  ... సంభవంగా మారుతుంటాయి. వాస్తవానికి  అభిమన్యుడి మీద తనకున్న అనంతమైన ఆ నమ్మకమే కృష్ణుడిని అలా మాట్లాడించింది. అయితే ఎదుటి వ్యక్తిమీద తనకున్న నమ్మకానికీ, ఎదుటి వ్యక్తికి తన  మీద తనకున్న  నమ్మకానికీ మధ్య ఒక్కోసారి పొంతన కుదరకపోవచ్చు. పొంతన కుదరని ఆ వైరుధ్యాలే ఒక్కోసారి మహా మహా విషాదాలకు మూలమవుతాయి. ఏమైతేనేమిటి? ఒక వీర మరణం, వేయి విజయాల కన్నా ఎక్కువేనన్న నిజాన్ని ఎవరికి వారు ఒప్పుకోవలసిందే! ముందు తరాలకు ఆ స్పూర్తినీ, ఆ సంకల్ప జ్ఞానాన్నీ ఎప్పటికప్పుడు అందించవలసిందే!!

                                                           - బమ్మెర