పాటలో ఏముంది?
మధ్యలో కలసి, మధ్యలోనే విడిపోయే వారిని బాటసారి అనికాకుండా ఇంకేమంటాం! కాకపోతే, సహభాటసార్లు, కలిసినడుస్తూ , కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణ కష్టాన్ని మరిచిపోవడానికే పరిమితమైతే సరే కానీ, తెలిసో తెలియకో ఒకరి హృదయంలోకి మరొక రు ప్రవేశిస్తేనో! అప్పుడింక దేని కథ దానిదే! కాకపోతే, ముందు ఇరువురి దారులూ, తీరాలూ వేరు వేరే అయినా, హృదయ బంధం ఏర్పడ్డాక నైనా, ఇద్దరూ ఒకే బాటను ఎంచుకుని, ఇద్దరూ ఒకే తీరాన్ని చేరుకుని, ఇద్దరూ ఒకే జీవితాన్ని పంచుకుంటే అది బాగానే ఉంటుంది. అలా కాకుండా, ఏవేవో కారణాలు చెప్పుకుని, కొద్ది కాలానికే ఎవ రి దారిన వాళ్లు వెళ్లిపోతే ఏముంటుంది? ఆ తర్వాత నదికి ఈ దరిన ఒకరు ఆ దరిన ఒకరూ నిలబడి ‘నను మరవకోయీ ... నను మరువకోయి’ అనుకంటే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? తాము మోయాల్సిన భారాన్ని తాము మోయకుండా, తాము చేయాల్సిన సాహసమేదీ తాము చేయకుండా ‘నువ్వు సుఖంగా ఉంటే చాలు ... నువ్వు సుఖంగా ఉంటే చాలు’ అని ఇరువురూ అనుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? మానవ జీవితంలో సామాజిక నియమాల్ని తూచా తప్పకుండా పాటించడమో, లేదా ఉల్లంఘించడ మో, ఉల్లంఘించడం తప్పనిపిస్తే, అధిగమించడమో ఇవే ఉంటాయి. వాటిల్లో దేన్ని ఎంచుకుంటావనేది నీ అస్తిత్వానికీ, నీ వ్యక్తిత్వానికీ లేదా సమాజం పట్ల నీకున్న అవగాహనకు సంబంధించిన విషయం.
వగే గానీ నీపై - పగ లేది దాన
కడ మాటకైనా - నే నోచుకోనా // ఓ బాటసారీ //
ఏ సమాజంలోనైనా, వ్యక్తి వ్యక్తికీ, వేరువేరుగా అన్వయించే సూత్రీకరణలేవీ ఉండవు. సమష్టిగానే అది కొన్ని ఆలోచనలు చేస్తుంది.. తోచిన రీతిలో కొన్ని నీతులూ, కొన్ని నియమాలూ రచిస్తుంది. వాటివల్ల ఎక్కువ మందికే మేలు జరిగినా, కొద్ది మందికైనా ఎంతో కొంత నష్టం జరగకుండా ఉండదు. రైతుకు మేలు చేసే వర్షాలు, సాఽధారణ బాటసారికి పెద్ద ఉపద్రవంలా అనిపించడం సహజం. ఏది ఎలా ఉన్నా, అటు సమాజానికీ, ఇటు దైవానికీ అంటే అనంత ప్రకృతికి బలి అయ్యే వారు ఏదో ఒక నిష్పత్తిలో ఉండనే ఉంటారు. వారంతా బలిపీఠాలు మోస్తూ అక్కడో ఇక్కడో కనపడుతూనే ఉంటారు. ఈ నిజాల గురించి ఆసాంతం తెలియకపోవడం వల్ల కొంత మంది ఎదుటివారిపైన నిష్టూరాలు పోతూనే ఉంటారు. ఈ నిష్టూరాల వెనుక చాలా సార్లు, విచారమే ఉంటుంది తప్ప, పగ, ప్రతీకార భావాలు ఉండే అవకాశం చాలా తక్కువ. సామాజిక అంశాలతో, ప్రపంచ విషయాలతో ముడివడిన ఇలాంటి సంక్లిష్ట విషయాలు చాలా వరకు మనిషి అదుపాజ్ఞలలో ఉండవు. అందువల్ల సహజంగానే అవి మనిషిని తీరని వ్యధకు గురిచేస్తాయి. హృదయాన్ని కన్నీటి సంద్రం చేస్తాయి. ఆకాశమెత్తు శోకమూర్తిని చేస్తాయి.
సదా మాసిపోనీ - స్మృతే నాకు మిగిలే- మనోవీణ నీతో గొనిపోయెదోయి // ఓ బాటసారీ //
తీగలు తెగిన వీణను సరిచేయడానికి గానీ, తీగలు భిగించి శృతిచేయడానికి గానీ, అంత గొప్ప కళాకౌశలమేమీ అవసరం లేదు. రాగరంజితమైన కాస్తంత హృదయముంటే చాలు. మనసు పరవశించిపోవడానికి గానీ, మరొకరి వశం కావడానికి గానీ, తీయతేనియల మాటలేమీ అవసరం లేదు. రసోన్మత్తమైన పాటలూ అవసరం లేదు. నిర్మలమైన ఒక నిండు మనసు, మరొకరి మనసు నొప్పించని మంచితనం ఉంటే చాలు! అవి ఎంతటి వారినైనా, పులకింపచేస్తాయి. వారి హృదయాల్ని అమృతమయం చేస్తాయి,. ఎప్పటికీ మరిచిపోని, ఎన్నటికీ మాసిపోని జ్ఞాపకాలను సైతం అవి ఎదలోకి వంచుతాయి. ఆ తర్వాత జీవితాలు చేరువవుతాయా, వేరువేరుగానే ఉండిపోతాయా అన్నది వే రే విషయం కానీ, ఒకరి హృదయ వీణ మరొకరి చేతుల్లో వాలిపోవడం మాత్రం ఖాయం. చేతుల్లో వాలిన రెండు వీణలూ ఒకే గూటికి చేరతాయా? ఒకరి వీణను ఇంకొకరు తీసుకుని చెరోదారిన వెళ్లిపోతారా అనేది కూడా ముందుగా ఎవరూ ఏమీ చెప్పలేరు. అదంతా అప్పటి ఆ హృదయోద్వేగాల పైన, సాహసోపేతమైన వారి అడుగుల పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏ కారణంగానో ఇద్దరూ నిస్పృహలో - విస్మృతిలో పడి ఉంటే మాత్రం అదను చూసి, కాలమే ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడింక ఇరువురూ శిరసావహించి కాల నిర్ణయానుసారం నడుచుకోవడం తప్ప ఇద్దరిలో ఎవరికీ మరో దారే ఉండదు!
- బమ్మెర