22, ఏప్రిల్ 2021, గురువారం

డాక్టర్ చక్రవర్తి సినిమా | పాడమని నన్నడగవలెనా పాట | Telugu old songs

పాటలో ఏముంది? 

పాడమని అడిగితేనే అని కాదు. ఎదుటి వారి మనసు తెలిసి... అడగకుండానే, ఆలపించే  తత్వం ఏ కళా హృదయానికైనా సహజంగానే ఉంటుంది. అలాంటిది ... ప్రాణానికి ప్రాణమైన, మమతానురాగాలకు నిలువెత్తు ప్రతిరూపమైన అన్నయ్యే స్వయంగా పాడమని అడిగితే... ఆ ఆనందానికి ఇంక అవధులేం  ఉంటాయి?  కాకపోతే, సరిగ్గా అదే సమయంలో ఏ కారణంగానో గుండె తడారిపోయి, గొంతు కాస్త తడబడితే ఎలా ఉంటుంది? ఆ చెల్లెలు, అన్నయ్య ఆనందం కోసం, ప్రాణాన్ని ఫణంగా పెట్టయినా సరే ఆ పాటకు ప్రాణం పోస్తుంది. హృదయాన్ని పెగిలించి వేయి జలపాతాలు ప్రవహింపచేస్తుంది. 1964 లో విడుదలైన 'డాక్టర్ చక్రవర్తి' సినిమాలోని ఓ సందర్భం కోసం, ఆచార్య ఆత్రేయ రాసిన పాట ఇది. ఎస్ రాజేశ్వర రావు రాగబద్ధం చేసిన ఈ పాటను సుశీల ఎంత ఆర్థంగానో ఆలపించింది. మరోసారి విందామా మరి !!

పాడమని నన్నడగవలెనా...... 



పాడమని నన్నడగవలెనా - పరవశించి పాడనా ....
నేనే పరవశించి పాడనా .....!

మేఘాల్ని వర్షించమని ... అడిగినా అడగకపోయినా అవి వర్షిస్తాయి అంతే .... నదుల్ని ప్రవహించమని అడిగినా అడగకపోయినా అవి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. కొమ్మల్ని చిగురించమని ఎవరూ అడగరు. అయినా అవి చిగురిస్తూనే ఉంటాయి. కోయిలల్ని పాడమని ఎవరూ అడగరు. ఎద నిండినప్పుడు, మది పొంగినప్పుడు ఎన్నెన్నో రాగాలు ఎగదన్నుకుని వాటి గొంతుదాటి వచ్చేస్తాయి. పారవశ్యంలో తేలాడే మనసు కూడా అంతే మరి ! అయిన వాళ్ల కోసం, ఆత్మీయుల కోసం, మనసున్న మనుషులందరి కోసం హృదయ వీణ మధుర మదురంగా పలుకుతుంది ... పాడుతుంది. మామూలుగానే ఇలా ఉంటే, ప్రాణమైన వారు, తామే పాడమని అడిగితే ఇంకేమైనా ఉందా? ఆ హృదయం పదింతలుగా స్పందిస్తుంది. వేయింతల పారవశ్యంతో గొంతు రసద్వనులు ఒలికిస్తుంది. 

నీవు పెంచిన హృదయమే ... ఇది నీవు నేర్పిన గానమే ...
నీకు గాక ఎవరి కొరకు - నీవు వింటే చాలు నాకు .... // పాడమని //

పాదు  తీసి, నీరు పోసి, తనను పెంచి పెద్దచేసిన వనమాలిని ఏ పూవైనా మరిచిపోతుందా? ఆ వనమాలి కనపడితే చాలు కళ్లు వేయింతలు చేసుకుని, నీరాజనం పడుతుంది. నిలువెల్లా పులకించిపోతుంది. తన పరిమళాలన్నీ ఆ వనమాలి ఎదపై వెదజల్లాలనుకుంటుంది. ఎవరు పెంచిన హృదయాన్ని వారికే  నైవేద్యంగా సమర్పించడంలో కలిగే ఆనందం మరెక్కడైనా లభిస్తుందా? కాకపోతే, ఆ పరిమళాలు, ఆ వనానికే, ఆ వనమాలికే పరిమితమైపోవు. వద్దన్నా, కాదన్నా, ఆ పరిమళాలు అవతలి వారిని కూడా తాకుతాయి.  ఇష్టాఇష్టాలను బట్టి, ఇతరులకు అవి నచ్చడం, నచ్చకపోవడం అది వేరే మాట,  ఆ ఇతరుల మాట ఎలా ఉన్నా, తన పరిమళాలు తనకు జన్మనిచ్చిన ఆ వనమాలిని చేరినా చాలనుకుంటాయి పూలు . రుణం అలా తీరిపోతుందని కాదు గానీ, తన జన్మ అలా ఎంతో కొంత ధన్యమౌతుందనుకుంటాయి. తనకు అమృతాన్ని పంచిన  దోసిళ్లల్లో వాలిపోతే చాలనుకుంటాయి. అక్కడే తన ప్రాణాలు వదిలినా అదృష్టమే అనుకుంటాయి. 

చిన్న నాటి ఆశలే ...ఈనాడు పూచెను పూవులై ...
ఆ 
పూవులన్నీ మాటలై వినిపించు నీకు పాటలై - // పాడమని //

 ప్రతి మొగ్గా, పూవయ్యే దాకా ఉంటుందన్న గ్యారెంటీ ఏదీ లేదు. ఎందుకంటే, ఆ మధ్యే విరుచుకుపడే ఏ సుడిగాలికో అవి రాలిపోవచ్చు. ఏ వడగాలికో  ఆవి వాడిపోవచ్చు. ఎన్నెన్నో మొగ్గలు అలా వికసించక ముందే రాలిపోయినట్లు, ఎన్నో జీవితాలు ఇంకా ప్రయాణం మొదలెట్టకముందే మృత్యువాత పడి ముగిసిపోతుంటాయి. అందువల్ల అందరి చిన్ననాటి  ఆశలు ... తప్పనిసరిగా నెరవేరతాయన్న గ్యారెంటీ ఏదీ ఉండదు. ఒకవేళ ఎక్కడైనా, ఎవరి ఆశలైనా నిజంగానే నెరవేరితే ... వారికి అంతకన్నా ఏం కావాలి? అదే జరిగితే, ఆ నెరవేరడానికి మూలభూతంగా ఉన్నవారి ముందు, ఆ పూలైనా, హృదయాలైనా నిలువెత్తు నివాళులై నీరాజనం పడతాయి. మమతలు మారాకులేసి  మొగిలి పూవులాంటి మాటలవుతాయి. కమ్మ కమ్మని పాటలవుతాయి ఆ పాటల మాధుర్యాల్లో తేలియాడటం కన్నా మించిన ఆనందం మరేముంటుంది? 

ఈ వీణ మ్రోగక ఆగినా ... నే  పాడజాలకపోయినా ......
 నీ మనసులో ఈనాడు నిండిన ..... రాగమటులే ఉండనీ 
అనురాగమటులే ఉండనీ ..... // పాడమని // 

ఏ పూవైనా ఎంతకాలం ఉంటుంది? ఎంత ఆశగా ఉన్నా, ఎంత కాలం తన పరిమళాలు వెదజల్లగలుగుతుంది? పూవూ, కొమ్మా అనే కాదు ప్రపంచంలోని ఏదీ శాశ్వతం కాదు కదా! అందుకే ఈ రోజు గంపెడు పరిమళాలు వెదజల్లిన పూల చెట్టు, రేపు ఏ పెనుగాలికో కొమ్మలు విరిగిపడి, మ్రోడై పోవచ్చు. అప్పటిదాకా రసరంజకమైన  రాగాలు పలికిన వీణలు, ఏ భూకంపమో వచ్చి, విరిగిపడవచ్చు. తీగెలన్నీ తెగిపోయి, మూగవైపోవచ్చు. జీవన వేదికల పైన ఎవరెంత కాలం ఉంటారో ఎవరూ చెప్పలేరన్నది ఆకాశమంత నిజం. అయితే, మానవ మస్తిష్కంలోని జ్ఞాపకాల గ్రంధాలు చిరకాలం నిలిచే ఉంటాయి. అక్షరం అక్షరంలో జీవితపు తడి నింపుకుని, పుటలన్నీ తనరారుతుంటాయి. ఆత్మానుబంధాల పునాదుల పైన వెలసిన ప్రేమలోకాలు, ఎప్పటికీ తమ ఉనికిని కోల్పోకుండా అలా ఉండిపోతాయి. వాటిల్లో తిరుగాడే రాగబంధాలు, అనురాగ బంధాలు ఆకాశంలోని నక్షత్రాల్లా ఎప్పటికీ చెక్కుచెదరకుండా అలా నిలిచిపోతాయి !!

                                                               - బమ్మెర


5, ఏప్రిల్ 2021, సోమవారం

గుఱ్ఱం జాషువా - శిశువు పద్యం | బొటవ్రేల ముల్లోకములు | తెలుగు పద్యాలు

పద్యమాధురి

మనసంతా మమతల మాధుర్యాలు నింపే ఈ పద్యం గుఱ్ఱం జాషువా రాసిన ‘ శిశువు ’పద్య ఖండికలోనిది. ఘంటసాల స్వరపరిచి, గానం చేసిన ఈ ప్రైవేట్‌ అల్బమ్‌లోని పద్యాలు సినిమా పద్యాలకు సరిసమానంగా ఆదరణ పొందాయి. విని ఆనందించండి. 

మాట రాని మహరాజు



బొటవ్రేల ముల్లోకమలు చూచి లోలోన
                     ఆనందపడు నోరులేని యోగి
తల్లిదండ్రుల తనూవల్లరీద్వయికి వ
                     న్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు, విషమను వ్యత్యాసమెఱుంగ కా
                     స్వాదింప జను వెఱ్ఱిబాగులాడు
అనుభవించుకొలంది నినుమడించుచు మరం
                     దము జాలువారు చైతన్యఫలము
భాషరాదు వట్టి పాలుమాత్రమె త్రాగు
నిద్రవోవు, లేచి నిలువలేడు
ఎవ్వరెరుంగ రితనిదే దేశమో కాని
మొన్న మొన్న నిలకు మొలచినాడు

పాతాళం, నేల, ఆకాశం అత్యంత సహజమైన ప్రాకృతిక భావన లే కావచ్చు. కానీ, కొందరి దృష్టిలో ఇవి అధమం, మధ్యమం, ఉన్నతం అనే జీవన ధశలకు ప్రతీకలు.  వీటినే కొందరు రాక్షస, మానవ, దేవలోకాలుగా చెబితే, ఇంకొందరు ముల్లోకాలుగా చెబుతారు. అయితే, తాము పాతాళంలో పడిఉన్నామనుకునే వాళ్లంతా భూమ్మీదికి రావాలనుకుంటారు. అప్పటికే భూమ్మీద ఉన్నామనుకునే వాళ్లు ఆకాశంలోకి ఎగరాలని చూస్తుంటారు. అందుకు కారణం, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అన్న బేదభావాలే. అయితే, పాలుతాగే పసిబిడ్డలకు ఈ బేదభావాలేమీ ఉండవుగా! అందుకే అన్నింటినీ ఒకటిగానే చూస్తారు.  త్రికాలాలను ఏకకాలంగా చూసే మహర్షిలా, ముల్లోకాలను ఒకే లోకంగా అనుభూతి చెందే ఆ లేత మనసు అద్వైత స్థితిని ఏమనుకోవాలి? అప్పటికి ఇంకా మాటలు రాకపోతే, మౌనర్షి అనుకోవచ్చు. లేదా మహాయోగి అనుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే, ఇది అమృతమా... విషమా అనే మీమాంస కూడా వీరికి ఉండదు. అందుకే ఎవరు ఏమివ్వచూసినా నోరు తెరుస్తారు. ఇవ్వగానే చప్పరిస్తూ చప్పట్లు కొడతారు. విషమూ, కల్మషమూ మచ్చుకైనా కానరాని ఆ మధురఫళాన్ని ఎంత ఆరగిస్తే మాత్రం తనివితీరుతుంది? ఎల్లలెరుగని, ఏ భాషా తెలియని ఈ  పసిబిడ్డలది ఏ దేశం అనుకోవాలి? అయినా విశ్వమానవులకు దేశాల తొడుగులెందుకు? 
మన పిచ్చిగాని.......!!
                                                                    - బమ్మెర

======================================