21, జులై 2021, బుధవారం

మల్లియలారా...! మాలికలారా...పాట | నిర్దోషి సినిమా | తెలుగు పాత పాటలు లిరిక్స్ |

పాటలో ఏముంది?


రాగం, భావం .... సమ ఉజ్జీగా సాగే గీతాల సంఖ్య చాలా అరుదే! ‘ నిర్దోషి’  సినిమా కోసం ఘంటసాల కూర్చిన బాణీ కోసం నారాయణరెడ్డి రాసిన ఈ పాట ఆ అరుదైన పాటల్లో ఒకటి. లోతైన భావాల్ని లోతైన మాటలతో చెప్పడం ఎప్పుడూ జరిగేదే! కానీ ఎంతో లోతైన భావాల్ని కూడా అలతిఅలతి పదాలతోనే పలికించడం ఈ పాటలో జరిగిన ఒక విశేషం. విషయాన్ని పూర్తిగా కధాంశంతో ముడివేసి చెప్పినప్పుడు ఆ అనుభూతులకు కొందరు బాగా దగ్గరైతే, కొందరు మరీ దూరమైపోతారు. ఆ కథ తమలాంటి వాళ్లది కాదులే అనుకోవడమే అందుకు కారణం.  అందుకు భిన్నంగా విషయాన్ని లీలగా ఒక ‘ఆరా’ లా నడిపించడం వల్ల ఈ పాటను కోటానుకోట్ల మంది అక్కున చేర్చుకున్నారు. నిజానికి, ఘంటసాల స్వర - గానమాధురి నారాయణ రెడ్డి భావఝరిని మరింత రసార్థ్రం చేసింది. వెయ్యిన్నొక్కమారేమో! విని ఆస్వాదించండి మరి!

మల్లియలారా...! మాలికలారా...!!



మల్లియలారా .... మాలికలారా
మౌనముగా ఉన్నారా ... మా కథయే విన్నారా!

మనిషిని పోలిన మనిషి ఉన్నట్లు,  జీవితాల్ని పోలిన  జీవితాలూ ఉంటాయి. అందువల్ల ఎవరినో చూసి ఇంకెవరో అనుకోవడం,  ఎవరి గురించో చెప్పినవాటిని,  ఇంకెవరి గురించో అనుకోవడం జరిగిపోతూ ఉంటుంది. పైగా చెప్పడం చేతగాని వాళ్లు చెప్పినవేవో విని, విని అర్థం చేసుకోలేని వాళ్లు  తమకు అంతా అర్థమైపోయిందనుకుని, తెగించి అందరికీ చెబుతూ వెళతారు. అసలు తాము విన్నది నిజమేనా అన్న కనీస మీమాంసలోకి కూడా వెళ్ళకుండా  ఎంత దుమారమో లేపుతారు. ఎందుకంటే, వికృతమైన, విచిత్రమైన సంఘటనల్ని రోజూ అక్కడో ఇక్కడో చూసే కళ్లు ఇక్కడ కూడా అవే జరిగాయనే అనుకుంటారు. కానీ, ఏ జీవితానికి ఆ జీవితం పూర్తిగా భిన్నమనీ, చాలా సార్లు ఒక జీవితానికీ, మరో జీవితానికీ మధ్య పొంతనే ఉండదని గ్రహించరు. వీళ్లవల్ల  ఒక్కోసారి మనుషుల మధ్య అంతులేని దూరాలు, మనసుల మధ్య అంతుచిక్కని అగాధాలు చోటుచేసుకుంటాయి. మరీ బాధాకరం ఏమిటంటే, ఎవరో పరాయి వాళ్ల ధోరణి ఇలా ఉంటే ఏదోలే అనుకుని, ఉండిపోవచ్చేమో గానీ. అయినవాళ్లు, జీవితంలో భాగమైన వాళ్లే అలా వ్యవహ రిస్తే ఎలా ఉంటుంది?  ఏదో కొద్ది రోజుల బాధే అనుకోవడానికి కూడా వీళ్లేదు. ఒక్కోసారి ఇవి సుదీర్ఘకాలం కొనసాగి, జీవితాలకు జీవితాలనే బలితీసుకుంటాయి. మరో సమస్య ఏమిటంటే ఎంతో గుండెకోతకు గురైన ఇలాంటి వాళ్లకు తమ బాధేమిటో చెప్పుకోవడానికి ఒక్కోసారి మనిషే దొరకరు. ఏం చేయాలో తోచక,  గుండె బరువు దించుకోవడానికి వీళ్లకు చెట్టుకో గుట్టకో చెప్పుకోవాల్సిన గతి పడుతుంది. ఈ కథానాయకుడు మల్లెల ముందు, మల్లె మాలికల ముందు మనసు విప్పడంలోని కారణం కూడా ఇదే!

జాబిలిలోనే జ్వాలలు రేగే - వెన్నెలలోనే చీకటి మూగే
పలుకగ లేక పదములు రాక, పలుకగా... లేక, పదములే,... రాక
బ్రతుకే తానే బరువై సాగే // మల్లియలారా // 

మనిషి తెలివి తేటలు ఎంత పెరిగిపోయాయీ అంటే, చెట్లల్లో, పొదల్లోనే అని కాదు, మనిషి నీళ్లల్లోనే నిప్పు పుట్టించగలడు. చల్లచల్లని చంద్రమామనే చండ్రనిప్పుల పాలు చేయగలడు! వెన్నెల వేళల్ని కటిక చీకట్లతో నింపగలడు. చివరికి జీవితాల పైన కూడా ఇతని పైశాచిక ప్రయోగాలు ఇలాగే ఉంటాయి. ఒకటా రెండా? ఇలా చూస్తే, ఊహకందని, మాటకందని కల్లోలాలు మానవజీవిత ంలో కోకొల్లలు. ఏదో అవేశానికి  లోనై, సమస్త ప్రాణికోటికన్నా, భాష తెలిసిన మానవుడే బహుగొప్పవాడని చెప్పుకుంటాం గానీ, ఇతని భాష ఏమంత గొప్పది? నిజంగానే భాష అంత గొప్పదైతే ఓ మహా రచయిత ‘‘ చాలా బలహీనమైన భావాలు మాత్రమే భాష ద్వారా వ్యక్తమవుతాయి’’ అనేమాట ఎందుకంటాడు? కావలసిన పదాలన్నీ ఉన్నట్లు కేవలం పలకలేకపోవడమే సమస్య అన్నట్లు మాట్లాడతారు గానీ,  నిజానికి, పలకలేకపోవడం కాదు.. అసలా ఆ పదాలు లేకపోవడమే అసలు సమస్య! ఎంతసేపూ ఉన్న కాసిన్ని పదాలతో సరిపెట్టుకోవడం తప్ప ఏ భాషలోనైనా అంత సర్వసమగ్రమైన పదకోశం ఎక్కడుంది? మనోభావాల్ని ఆసాంతం అభివ్యక్తం చేయలేకపోతే... హృదయమూ చివరికి జీవితమూ బరువెక్కిపోక ఏమవుతాయి.? 

చెదరిన వీణ రవళించేనా... జీవన రాగం చిగురించేనా
కలతలు పోయి,  వలపులు పొంగి, కలతలే ... పోయి, వలపులే పొంగి
మనసే లోలో పులకించేనా // మల్లియలారా //

చెక్కవీణ చెదిరిపోతే ఏముంది? ఏ వాద్యనిపుణుడో వచ్చి నాలుగు ఘడియల్లో చక్కదిద్దిపోగలడు. సమస్య అంతా జీవన వీణ చెదిరిపోయినప్పుడే!  ఆ మాటకొస్తే,  శాస్త్రీయ స్వర రాగాలు పలికించడం కూడా ఎప్పుడూ సమస్య కాదు. సమస్య అంతా జీవన రాగాలు పలికించడం దగ్గరే! రాగాలు అంటే ధ్వనితరంగాలు అని కాదు కదా! కోటానుకోట్ల భావోద్వేగాల సమన్వితంగా వెల్లువెత్తే హృదయనాదాలవి! ఈ క్రమంలో కలతలు పోయి, వలపులు పొంగితే బావుందునని ఒక్క మాటలో అనేసుకోవచ్చు గానీ,  కలతలు పోవడానికీ,  అదే స్థావరంలో వలపులు పొంగడానికీ  మధ్య ఎన్ని వేల వంతెనలు నిర్మాణం కావాలి? అవి నిర్మాణమయ్యాక అయినా, ఆ చివరి నుంచి ఈ మొదలు దాకా ఎన్ని కోట్ల యోజనాల దూరం ప్రయాణం చేయాలి? అది మహామహా దూరమే! కాకపోతే ఒక నిండైన ఆశాహృదయానికీ కొండెత్తు ఆత్మవిశ్వాసానీకి  ఆ వంతెనల నిర్మాణ భారం, భారమే కాదు. ఆ ప్రయాణ దూరం,  దూరమే కాదు!!

                                                               - బమ్మెర 

================================

16, జులై 2021, శుక్రవారం

పాటలో ఏముంది?




చిత్రం: కన్నె వయసు (1973) గీతం: దాశరథి, సంగీతం : సత్యం, గానం : బాలసుబ్రహ్మణ్యం

ఊహ తెలిసిన నాటి నుంచి, ఉరుకూ పరుగుల దాకా, పసివయసు నుంచి పరవళ్ల ప్రాయం దాకా ఏ హృదయమైనా,  ఎన్నెన్నో మలుపులు చూస్తూ ప్రయాణం చేస్తుంది. ఏదో పైపైన అని కాదు, పగలూ రేయీ తన కళ్లముందరి పరిణామాలన్నింటినీ  నిషితంగా గమనిస్తూనే ఉంటుంది.  ఒకప్పుడు ఎంతో అపురూపంగా ఉన్నవి, ఆ తర్వాత ఎలా ఎలా మారిపోయాయో తనకు తెలుస్తూనే ఉంటుంది.  వాటిల్లో  జవజీవాలు కోల్పోయి, జీవచైతన్యాన్ని కోల్పోయి, కలుషిత, కల్మషాల కాసారాలుగా మారిపోయినవే ఎక్కువ. మన హృదయాల్ని అవి సహజంగా, సజీవంగా ఉండనీయకపోగా ఒక్కోసారి మన తనువూ, మనసుల్ని నిప్పుల కుంపటిగా మార్చేస్తుంటాయి. అందుకే, హృదయం ఈ శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలేవీ తాకని ఒక అతీత స్థితిని కోరుకుంటుంది. ఒక నవ్యత్వాన్నీ, దివ్యత్వాన్నీ కోరుకుంటుంది. అలాంటి సమున్నతమైన  కోరికల కొండ శిఖరమే ఈ గీతం.  1973లో విడుదలైన ‘ కన్నెవయసు’ సినిమా కోసం దాశరధి రాసిన ఈ గీతం, సత్యం స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం పాడిన నిలువెత్తు భావోద్వేగాల జలపాతం.

ఏ దివిలో విరిసిన పారిజాతమో !!



ఏ దివిలో విరిసిన పారిజాతమో... ఏ కవిలో మెరిసిన  ప్రేమగీతమో....
నా మదిలో నీవై నిండిపోయెనే...... // ఏ దివిలో /

భూమ్మీద కూడా పారిజాతాలు లభించవచ్చేమో గానీ, అవి కూడా ఇక్కడి మాలిన్యాలతో తమ సహజత్వాన్నీ, సజీవత్వాన్నీ ఎంతో కొంత కోల్పోయే ఉంటాయి కదా! ఇలాంటి స్థితిలో ఏ ఆశావహ హృదయమైనా ఏం కోరుకుంటుంది? నిర్మలమైన ఒక నవ్యత్వాన్ని కోరుకుంటుంది. కానీ,  పైకి నవ్యంగా అనిపించినా, ఎంతో కాలంగా ఇక్కడిక్కడే తిరుగుతున్నది, భూమ్మీది దుమ్మూ - ధూళీ, మసీ, రసీ పట్టి తన అస్తిత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ ఎంతో కొంత కోల్పోకుండా ఉండదు కదా! అందుకే ఇవేవీ తాకని, వీటన్నింటికీ అతీతమైన ఒక దివ్యత్వాన్ని అందుకు ప్రతిరూపంగా  దివిలోని పారిజాతాన్ని కోరుకుంటుంది. అప్పటిదాకా లేని, ఒక నవకవి హృదయంలోంచి అప్పటికప్పుడు పుట్టుకొచ్చి,  జీవితాన్ని ప్రజ్వలింపచేసే ఒక మణిమయ ప్రేమగీతాన్ని కోరుకుంటుంది. ఆ ప్రేమగీతమేదో వచ్చి వాలి తన హృదయమంతా నిండి పోతే, రసహృదయులకు అంతకన్నా ఏంకావాలి? 

నీ రూపమే దివ్య దీపమై - నీ నవ్వులే నవ్యతారలై 
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే,.... // ఏ దివిలో //

భూమ్మీది ప్రతిదీ కలుషితమవుతుంది ... ఒక నిప్పు తప్ప.  కలుషితం చేయాలన్న కుటిలత్వంతో  ఏదైనా నిప్పు చెంత చేరినా అదే కాలి బూడిదవుతుంది. నిజానికి, నిప్పుతో ప్రత్యక్షబంధమున్న ఏదీ కలుషితం కాదు. నిప్పుతో అంటుకునే దీపమూ కలుషితం కాదు.  అందుకే, ఆ నిర్మలత్వానికీ, దివ్యత్వానికీ ప్రతిబింబంగా మనిషి దీపాన్ని వెలిగిస్తాడు. ఈ యువకిశోరానికి తన  ప్రేయసి ఒక దివ్య దీపంగానే గోచరిస్తోంది. ఆమె నవ్వులు తానున్న నేలకు కోటానుకోట్ల యోజనాల దూరంలో ఉన్న నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. కొవ్వొత్తి దీపాలో, విద్యుద్దీపాలో కాకుండా ఆమె కన్నుల్లో తాను కోరుకున్న వెన్నెల వెలుగులు విర జిమ్ముతున్నాయి. ఇక్కడున్నవన్నీ మలినభూయిష్టమే అనుకున్న  ప్రతిసారీ మానవ హృదయం ఇక్కడివేవీ దరిచేరలేని ఒక అతీత స్థితిని కోరుకుంటుంది. ఆమె రూపం దివ్య దీపంగా అగుపించడానికి గల అసలు కారణం ఇదే! 

పాల బుగ్గలను లేత సిగ్గులు ... పల్లవించగా రావే....
నీలి ముంగురులు పిల్లగాలితో... ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే // ఏ దివిలో //

జీవన చిద్విలాసాల వైపు సాగిపోవడానికి ఎవరికైనా తొలినాటి లేలేత సిగ్గులే బీజాంశాలవుతాయి. చల్లగాలులూ, పిల్లగాలులూ.....,  ముంగురులనే కాదు, హృదయ ఝరుల్ని ఆకాశం వైపు నడిపించే పుష్పకవిమానాలవుతాయి. కాలి అందియలు శ్రవణానందం కలిగించడానికి మాత్రమే కాదు కర్ణపుటాల్లో కమ్ముకున్న మకిలిని తొలగించి, ఒక దివ్యనాదాన్ని ఆలకించేలా చేయడానికి, కావలసిన సున్నితత్వాన్ని అందిస్తాయి. లోకంలో ఏదైనా పుట్టేది... పుట్టిన చోటే కడదాకా పడి ఉండడానికి కాదు కదా! ఉన్నట్లుండి, అది మనల్ని ఎక్కడినుంచి ఎక్కడికో తీసుకువెళుతుంది. అంతిమంగా అది మనల్ని చేరవేసిన స్థావరం, అప్పటిదాకా మనం కనీవినీ ఎరగనిది, కనీసం ఊహించనిదే అవుతుంది.  అదొక అతీత స్థానమే కదా! అనాదిగా మనిషి తపనంతా ఆ అతీతస్థితిని అందుకోవడం కోసమే కదా!  

నిదుర మబ్బులను మెరుపు తీగవై - కలలు రేపినది నీవే....
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే... 
పదము పదములో మధువులూరగా... కావ్య కన్యవై రావే // ఏ దివిలో //

్ఞఅప్పటిదాకా ఆకాశమంతా పరుచుకుపోయిన మేఘాలు కాసేపట్లో కనుమరుగైపోవడం ఎన్నిసార్లు చూడలేదు? వర్షించడం అనే తమ  అసలు లక్ష్యాన్ని మరిచిపోతే, అదే జరిగిపోతుంది మరి! మేఘాలను ఆ స్థితినుంచి మేల్కొల్పడానికే అన్నట్లు, వాటి  మీద ఒక్కోసారి మెరుపు తీగెలు విరుచుకుపడతాయి. వాటి లక్ష్యాన్ని, లేదా అందమైన వాటి కలల్ని గుర్తు చేయడానికే ఆ ప్రయత్నమేదో జరుగుతుంది. నేల పైన పడి ఉన్న వీణపైన ఏ నభోనిలయాల వైపో నడిపించే ప్రణవ నాదాల్ని పలికించడం కూడా అలాంటి ఒక ప్రయత్నమే! అందులో భాగంగా ప్రణయ రాగాలూ పలకవచ్చు. ప్రణయం అంటే అదేమీ గాలితనం కాదు. రెండు ఒకటిగా మారే అద్వైత స్థితే అది. పాతాళాన్నీ, నేలనూ దాటి, మేఘాలూ, నక్షత్రాలూ దాటి, గగనసీమలో జీవన ఝంకారాలు పలికించే ప్రయత్నమది. ఈ అనుభవాలూ, అనుభూతులూ అంతిమంగా అక్షరబద్ధం అయితే అదెంత సార్థకత? ప్రణయ మూర్తి అందమైన ప్రబంధమై, ఆమె ఒక మహాకావ్యంగా అవతరిస్తే అంతకన్నా ఏం కావాలి? ఈ ప్రేమికుడు అదే కోరుకుంటున్నాడు. ఆ మాటకొస్తే, నిండు హృదయమున్న ప్రతి ప్రేమికుడూ అదే కోరుకుంటాడు! ఈ స్థితిలో మనం ఎక్కువగా ఆలోచించడం ఎందుకు? తధాస్తు అనేస్తే మన బాధ్యత తీరిపోతుంది!!

                                                                     - బమ్మెర

=======================================================

9, జులై 2021, శుక్రవారం

| ప్రీతి నర్థుల నాదరించు ధర్మసుతుండు పద్యం | శ్రీకృష్ణ పాండవీయం చిత్రం | తెలుగు పద్యాలు |

పద్యం


చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం , పద్యం : సముద్రాల , సంగీతం : టి.వి. రాజు , గానం ఘంటసాల 

కాలం ... విన్యాసాల విహారి !!




ప్రీతి నర్థుల నాదరించు ధర్మసుతుండు

                 పరుల ఆదరమున బతుకవలసె 

కొండలైనను పిండిగొట్టెడు భీముండు

                 ఆర్తుడై చేసాచి అడుగవలసె 

అరిభయంకర ధనుర్ధరుడైన పార్థుడు 

                   పరువును విడి జోలె పట్టవలసె

 కలికి వెన్నెల సోక కందిపోవు కవలు 

                    ఎండలో బిచ్చము నెత్తవలసె 


తిరిపెపుం బువ్వ నాకలి దీర్చుకొనుచు

బరుల పంచను కాపుర ముండవలసె

బ్రాహ్మణాకృతి పాండు భూపాలసుతులు

కటకటా ఎంత చిత్రమీ కాలమహిమ

ఆకాశం అనంతమైనదైతే , కాలమూ అనంతమైనదే ! సకల చరాచర జగత్తంతా కాలగర్భంలోంచి వచ్చిందే , కడకు కాల గర్భంలో కలిసిపోయేదే ! ఎల్లలు తెలిసే సముద్రగర్భంలోనే ఎన్నెన్నో పరిణామాలు , ఆ ఎల్లలే లేని కాలంలో ఎన్నెన్ని పరిణామాలు ? అనంత కోటి బాహువులతో అది చేసే విన్యాసాల ముందు ఈ రెండు చేతుల మానవుడి పాట్లు ఏపాటి ? అప్పటికీ మనిషి ఎంతో పోరాటం చేస్తాడు . అప్పుడప్పుడు గెలుస్తాడు కూడా ! అలాగని అన్ని సార్లూ గెలవలేడు కదా ! ఒక్కోసారి ఒక భీషణమైన ఓటమితో అతని ఉనికికే ఊరూ పేరూ లేకుండాపోవచ్చు . అలాంటి స్థితిలో ఒక్కోసారి మారువేషాలతో , మారుపేర్లతో మనుగడ సాగించాల్సిన గతికూడా పడుతుంది . ఒక దశలో పాండవులకు ఈ స్థితే ఏర్పడింది . 

నిజంగా కాలం ఎంత భీషణమైనది ! బయటికి కనిపించకపోవచ్చు గానీ , అది కోటానుకోట్ల అస్త్రాల్ని భూజానేసుకుని , నిరంతరం నీ చుట్టే తిరిగే మహాశక్తి స్వరూపిణి . అయితే , ఆ అస్త్రాల్లో కొన్ని నీకు మేలు చేసేవీ ఉండొచ్చు . నీపై దాడి చేసేవీ ఉండొచ్చు . కాకపోతే , కాలం సంధించే ఆ అస్త్రాల్లో ఏది నీకు మేలు చేస్తుందో , ఏది హాని చేస్తుందో చాలా సార్లు నువ్వు ఊహించలేవు . ఇక్కడే విషయాలు జటిలమవుతాయి . జీవితాలు సంఘర్షణాత్మకం అవుతాయి . సమస్యను ఎదుర్కోవడానికి , నీ బలాన్నీ , బలగాన్ని ఆసరా చేసుకుని నువ్వు ఎన్నెన్నో ప్రణాళికలు రచిస్తావు , వ్యూహాలు , ప్రతివ్యూహాలూ , చక్రవ్యూహాలూ వేస్తావు . నీకు నువ్వుగా నిలబడి , నీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడతావు . అయినా ఒక్కోసారి ఇవేవీ కొరగాకుండా పోవచ్చు . అందువల్ల అన్నిసార్లూ అన్నీ మన వశంలో ఉండవనేది మనిషి తెలియాల్సిన పరమసత్యం ! అలాంటి వశం తప్పిన పరిస్థితిలో అంతకు ముందున్న  జీవన సౌఖ్యాలూ , సౌలభ్యాలన్నీ పోయి , అప్పటిదాకా కొనసాగిన వైభవమంతా మాయమైపోవచ్చు . పలితంగా , ఒక్కోసారి ధీనాతి ధీనంగా , అత్యంత దయనీయంగా కూడా బ్రతుకు ఈడ్వవలసి రావొచ్చు ! 

అన్నీ బావున్నప్పుడు ఎంతో మంది నిరాశ్రయులకు నువ్వు ఆశ్రయం ఇచ్చి ఉండవచ్చు . ఇలా అంతా తలకిందులై పోయాక ఆశ్రయం కోసం నువ్వే ఇతరులను అర్థించవలసి రావచ్చు . ఒకప్పుడు ఎంతోమందికి అన్నపానీయాలు అందించిన నువ్వే పట్టెడన్నం కోసం పొట్ట చేతపట్టుకుని బిక్షాటన చేయవలసి రావచ్చు . దీన్నే కాలమహిమ అన్నారు పెద్దలు . ఆ మాటకొస్తే , మానవ జీవితం మాత్రం ఏం తక్కువ ? అదీ మహిమాన్వితమే ! కాకపోతే , కాలమహిమ ముందు కొన్నిసార్లు మానవ మహిమ నిలువలేదు . అందువల్ల పరాభవం పాలైన వాళ్లంతా అశక్తులు , అసమర్ధులు , వ్యర్థులు అనుకోవాల్సిన అవసరం లేదు . శిఖరాన్ని చేరుకున్న వారి గురించి గొప్పగా మాట్లాడినా , మాట్లాడకపోయినా వచ్చే పెద్ద నష్టమేమి  లేదు గానీ , నేల గూలిన వ్యక్తి గురించి తక్కువగా మాట్లాడటమే తగనిది . ఈ నిజాన్ని ఎవరికి వారు ఎప్పుటికప్పుడు తమ మనసుకు గుర్తు చేయడం ఎంతో శ్రేయస్కరం !! -                                                                                                                                ---బమ్మెర