30, జనవరి 2022, ఆదివారం

ఆగదు ఏ నిమిషము నీ కోసమూ పాట | ప్రేమాభిషేకం సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది? 

విశ్వానికన్నా అతీతమైనది  కాలం! ఈ మహా విశ్వాన్నంతా నడిపించేది కాలమే కదా ! అయితే, అనంతంగా,  నిరంతరాయంగా సాగిపోయే కాలం, తన  సహజతత్వానికి బిన్నంగా ఎప్పుడూ ఆగిపోదు. దీనికి తోడు నిత్యనూతనత్వం కోసమైన ఒక దివ్యకాంక్ష ఒకటి కాలం అంతరంగంలో కదలాడుతూ ఉంటుంది. ఉన్న తరం ఉన్నట్లే ఉండిపోతే ఆ  ఆకాంక్ష నెరవేరేదెట్లా? అందుకు అనుగుణంగానే కాలం ప్రతి ప్రాణికీ  ఒక నిర్ధిష్ట  కాల పరిమితి విధిస్తూ ఉంటుంది.  ఆ గడువు తీరగానే పాత తరాన్ని మృత్యునౌకను ఎక్కించి భూమ్మీది నుంచి సాగనంపుతుంది.  జనన నౌక మీద మరో నవ తరాన్ని నేల మీదికి రప్పిస్తుంది.  కాలపు ఈ మనోభీష్టాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే!  ఇష్టమైనా, కష్టమైనా ఆ పరిణామాల్ని సాదరంగా ఆహ్వానించాల్సిందే!

1981 లో విడుదలైన ’ ప్రేమాభిషేకం’  సినిమా కోసం దాసరి  నారాయణ రావు రాసిన తాత్వికమైన ఈ పాటను చక్రవర్తి  సంగీత సారధ్యంలో బాలు  ఎంతో భావోద్వేగంగా పాడారు. పల్లవి వినగానే  మనసేదో బరువెక్కుతున్నట్లు అనిపించినా ఒక్కో చరణమే దాటుతూ  లోలోతుల్లోకి వెళ్లే కొద్దీ మనసు ఎంతో తేలికపడుతుంది. ఎవరూ కాదనలేని ఆ జీవిత సత్యాల ప్రవాహాల్లో మరోసారి తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ అనుభూతి మళ్లీ మళ్లీ ఆస్వాదించాలని కూడా అనిపిస్తుంది. మనలోని ఆ భావనను భుజానేసుకుని ఆ పాటను మరోసారి వినేద్దామా మరి!!

ఆగదు ఏ నిమిషము నీ కోసమూ ....!


ఆగదూ ... ఆగదూ ...  ఆగదూ .....
ఆగదు ఏ నిమిషము నీ కోసము
ఆగితే సాగదు .. ఈ లోకము ... 

కాలానికి ఆదీ - అంతం అంటూ ఏమీ లేవు కదా! అయితే,  తూనికల్లోనో,  కొలమానికల్లోనో పెట్టనిదే మనిషి దేన్నీ పరిగణనలోకి తీసుకోడు! అందుకే ఉదయాస్తమయయాలు మనిషికి  ఆ వెసులుబాటు కలిగించాయి. వాస్తవానికి  అనంతమైన సృష్టి చైతన్యంలో భాగమైన ఈ  మనిషి కూడా  అనంతుడే! కానీ, ఆ అనంతత్వం కూడా కొన్నాళ్లకు  విసుగుపుట్టిస్తుందేమో! కాల పరిమితులంటూ లేకపోతే మనిషి మహా బద్ధకస్తుడైపోతాడేమో కూడా అనుకుని,  కాలం,  మనిషి ప్రాణశక్తికి  కొన్ని పరిమితులు విధించాలనుకుంది. ఆ వెంటనే జనన మరణాలంటూ కొన్ని సరిహద్దు రేఖల్ని గీసి ఎంతో మంచి పని చేశాననుకుంది. కానీ, ఇదే మనిషి హృదయాన్ని మహా వేదనామయం చేసింది. కాకపోతే,  ఆ వేదనే అతని జ్ఞానిని చేసింది, అతనిలో వేగాన్ని పెంచింది. విధినిర్వహణకు పురికొల్పింది. ఉన్నది పరిమిత కాలమే కాబట్టి,  ఉదయానికీ, అస్తమయానికీ మధ్య జరగాల్సినవన్నీ త్వరత్వరగా జరిగిపోవాలనుకున్నాడు మనిషి!  పరిమిత ప్రాణశక్తే కాబట్టి, జననానికీ మరణానికీ మధ్య నెరవేర్చాల్సినవన్నీ వెంటవెంట నెరవేర్చాలని కూడా అనుకున్నాడు. ఏమైతీనేమిటి ? చీకటి వెలుగుల మధ్య, జీవుల చేతన - అచేతనల మధ్య ఎక్కడా  ప్రతిష్టంబన ఏర్పడకూడదని  కాలం క్షణమాగకుండా సాగిపోతూనే ఉంటుంది. కాలం ఆగితే లోకమే ఆగిపోతుంది కదా మరి! అసలు నిజానికి , ఒకవేళ కాలమే కాసేపు ఆగాలనుకున్నా అది సాధ్యం కాదు. ఎందుకంటే, కాలం ఆగడం అన్నది కాలం చేతుల్లో కూడా లేదు మరి!. అందుకే అనంత ంగా నిర్విరామంగా కాలం అలా కొనసాగుతూనే ఉంది.  జీవితం అంటేనే కొనసాగడం కదా మరి! 

జాబిలి చల్లననీ ... వెన్నెల దీపమనీ .... 
తెలిసినా ... గ్రహణము ... రాకమానదు
పూవులు లలితమనీ ..తాకితే రాలుననీ 
తెలిసినా ... పెనుగాలి .. రాక ఆగదు
హృదయము అద్దమనీ, పగిలితే అతకదనీ 
తెలిసినా .. మృత్యువు రాక ఆగదూ.... // ఆగదు ఏ నిమిషము //

సృష్టిలో ప్రతిదానికీ నిర్దిష్ట కాలపరిమితులు ఉన్నాయి. అవి కచ్ఛితంగా అమలై తీరుతాయి. ఎవరైనా ఇంకాసేపు వెలుగు ఉంటే బావుణ్ణు అనుకున్నంత మాత్రాన సూర్యుడు అస్తమించకుండా  తాత్సారం చేయడు  కదా!. చేయవలసిన పనులేవో పూర్తి కాలేదని కారణంగా లోకంలో మరికొంత కాలం ఉండిపోవాలని మనిషి ఆశపడితే మాత్రం? మృత్యువు ఆ సడలింపు ఇవ్వదు కదా! తెరపడాల్సిన సమయంలో తెరపడితీరాల్సిందే!! జాబిలి చల్లదనాన్నే కదా ఇస్తోందని...., వెన్నెల వెలుగులే కదా పంచుతోందని  రావాల్సిన సమయాన గ్రహణం రాకుండా ఆగిపోదు కదా! పూలు లోకానికి పరిమళాలు పంచుతూ,  ప్రాణికోటికి సున్నితత్వాన్ని అందిస్తాయని ప్రకృతికి తెలియదా? అయినా వడగాలులూ, పెనుగాలులూ, అసలే రాకుండా ఉండవు కదా! అవెందుకూ అంటే  వాటి ద్వారా, సమస్త ప్రాణికోటికీ , ప్రతేక్యించి మనిషికి విశ్వం కొన్ని పాఠాలు చెప్పాలనుకుంటుంది. వాటివల్ల ఎవరికెంత బాధ  కలిగినా అది ఆ పాఠాలు చెప్పే తీరుతుంది.  రాళ్ల వర్షం పడి,  అద్దాల మేడ వ్రకలైపోవచ్చు. ఏదో విధ్వంసం జరిగి, జీవన సౌధం నేల మట్టం కావచ్చు.  అయినవాళ్లూ, ఆత్మీయులూ ప్రాణాలు పోయి, మట్టిలో కలిసిపోవచ్చు.... దహనమై ఆకాశంలో కలిసిపోవచ్చు. పోయిన వాళ్లుపోగా  వాటిద్వారా  ఉన్నవాళ్లందరికీ కాలం జీవితపాఠాలో,  మృత్యుపాఠాలో చెబుతూనే ఉంటుంది. మనిషి వాటిని వినితీరాల్సిందే! అలా జన్మ తరించాల్సిందే!

జీవితమొక పయనమనీ ... గమ్యము తెలియదనీ .... 
తెలిసినా ...ఈ మనిషీ పయనమాగదు 
జననం ధర్మమనీ ... మరణం ఖర్మమనీ 
తెలిసినా జనన మరణ చక్రమాగదు... 
మరణం తధ్యమనీ ... ఏ జీవికి తప్పదనీ 
తెలిసినా .. ఈ మనిషి ... తపన ఆగదు // ఆగదు ఏ నిమిషము //

జీవిత ంలో గమనమే తప్ప గమ్యం ఉండదు ఇది వాస్తవం! ఎందుకంటే, అదేదో గమ్యం అనుకుని ఎంతో కష్టపడి తీరా అక్కడికి చేరుకునే సరికి అది గమ్యమే కాదనీ,  గమ్యానికి చేరే అనంత కోటి ద్వారాల్లో  ఇది ఒకటి మాత్రమేనని  తేలిిపోతూ ఉంటుంది.   జీవనయానమంతా మజిలీలు మజిలీలుగానే ిసాగిపోతూ ఉంటుంది ఇది నిజం . కాకపోతే ప్రతిసారీ మనిషి, మజిలీనే గమ్యమని పొర బడుతుంటాడు. పోనీ,  చివరికి మరణాన్నే గమ్యం అనుకుందామా అంటే అదీ కుదరదు. ఎందుకంటే, ’మరణం అంతిమ దశ ఏమీ కాదు, మరణించేది శరీరమే తప్ప ఆత్మ కాదు,  అసలు ఆత్మకు మరణమే లేదు అని చెప్పే అనేక వాదనలూ, సిద్ధాంతాలూ లోకంలో అనాదిగా ఉన్నాయి. అందులో భాగంగా మరణం తర్వాతే కాదు. ఇప్పటి ఈ జన్మకు ముందు కూడా  ఆయా జన్మల ఖర్మానుసారం  ఆత్మ ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ వచ్చిందనీ వాదన కూడా ఉంది . పూర్వ జన్మలూ, పునర్జన్మల విషయం పక్కనబెడితే, ఇప్పటి ఈ జన్మలోనైతే మరణం తప్పదనే సత్యం  అందరికీ తెలిసిందే! ఎన్ని చేసినా మనిషి జీవితకాలాన్ని  కాస్త పొడిగించుకోగలడే గానీ, మరణాన్ని పూర్తిగా అధిగమించలేడుగా! ఈ క్రమంలో జననమే కాదు మరణం కూడా మనిషి చేతిలో లేదనే విషయం కూడా స్పస్టమవుతుంది  . అయితే, మనిషి చేతిలో ఉన్నదేమిటి మరి? జననానికీ మరణానికీ నడుమ నడిచే  ఆ మధ్య కాలమొక్కటే అతని చేతిలో ఉంటుంది.   ఆ నాలుగు రోజల మధ్య  కాలాన్ని మనిషి ఎంత అర్థవంతంగా, ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటాడన్న దాని పైనే అతని జీవిత ఔన్నత్యమూ, అతని ఆత్మానందమూ అన్నీ ఆధారపడి ఉంటాయి. అంతే!!

                                                                                     - బమ్మెర 

13, జనవరి 2022, గురువారం

మత్తు వదలరా నిద్దుర పాట | శ్రీకృష్ణపాండవీయం సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?

ప్రతిదాన్నీ ఒక ప్రపంచంగా చూడటం అనాదిగా మనిషికి అలవాటే! ఈ ధోరణి ఒక రకంగా మనిసికి మేలే చేస్తుంది. విషయాల విశ్వరూపాన్ని చూడటం ద్వారా వాటిలోని అణవణువునూ చూడగలుగుతాం. ఇది ప్రయోజనకరమే! కాకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా విధ్వంసం జరిగినప్పుడు  మొత్తం ప్రపంచమే ధ్వంసమైనట్లు అనుకుంటేనే సమస్య. అలా అనుకుంటే,  ఇక దాన్నుంచి బయటపడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే సమస్యలో కూరుకుపోవడం కాకుండా, దాన్నించి బయటపడే దిశగా మనిషి ఆలోచనలు సాగాలి. సర్వశక్తులూ వెచ్చించి ఆ వైపే అడుగులు వేయాలి అంటారు పెద్దలు.

1966లో విడుదలైన ’ శ్రీకృష్ణపాండవీయం’ సినిమా కోసం కొసరాజు రాసిన ఈ పాటలో మనిషికి అవసరమైన ఆ స్పూర్తి నిండుగా లభిస్తుంది. టీ.వీ. రాజు సంగీత సారధ్యంలో ఘంటసాల పాడిన ఈ పాట దాదాపు 60 ఏళ్లుగా మానవాళికి అలాంటి జీవితపాఠాలు చెబుతూనే ఉంది. ప్రతి రోజూ వినాల్సిన ఈ పాటను ఈ రోజు మనం మరోసారి ప్రత్యేకంగా విందాం మరి!!

మత్తు వదలరా నిద్దుర !!


అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి
అంధకారమలిమినపుడు వెలుతురుకై వెతకాలి
ముందుచూపు లేనివాడు ఎందులకూ కొరగాడు
సోమరియైు కునుకువాడు సూక్ష్మమ్ము గ్ర హించలేడు

అప్పటిదాకా థీరగంభీరుడిగా కనిపించిన వాడు కూడా,  అనుకోని అపాయం ఎదురైనప్పుడు, లేదా కటిక చీకట్లు కమ్ముకున్నప్పుడు  బెంబేలెత్తిపోతాడు. ఎందుకంటే, ఆ క్షణాన అతనికి ఆ అపాయం తాలూకు విధ్వంసమే అంతటా కనిపిస్తుంది. దాన్ని అదిగమించే మార్గమే ఇక లేదనిపిస్తుంది. అంధకారం కమ్ముకున్నప్పుడూ అంతే! లోకమంతా చీకటిమయమే అనిపిస్తుంది. చీకటి కాక లోకంలో మరేమీ లేద నే అనిపిస్తుంది. ఎందుకంటే అపాయాలైనా, అంధకారాలైనా స్థూలంగా, బండబండగా ఉంటాయి. అయితే, వాటిని అధిగమించే మార్గాలేమో పరమ సూక్ష్మంగా ఉంటాయి. అందువల్ల  ఎంతో సూక్ష్మబుద్ది ఉంటే గానీ, అవి గోచరించవు. బోధపడవు. అందుకే ఇక్కడ ఉండి ఇంకేమీ చేయలేమని,  కొందరు ఊరొదిలేసి, మరికొందరు దేశం వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్లిపోతారు మరికొందరేమో తనువే చాలిస్తారు. జీవితాన్నే ముగిస్తారు. జీవితంలో సుఖసంతోషాలే కాదు, ఒక్కోసారి అనుకోని విపత్తులు వచ్చిపడతాయని, వాటిని ఎదుర్కోవడానికి ఎల్లవేళలా సంసిద్దంగా ఉండాలనే  ముందుచూపు లేని తనమే  ఆ విషాదాంతాల వెనుకున్న  మూలాంశం!  ప్రతి ప్రశ్నకూ సమాధానం ఉంటుందనీ,  ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందనే జ్ఞానం కొరవడటమే అందుకు అసలు కారణం!

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోన బడితే, గమ్మత్తుగ చిత్తవుదువురా // మత్తు వదలరా //

మనిషిని మత్తులో ముంచెత్తడానికి మద్యం, మాదక ద్రవ్యాలే అవసరం లేదు, వేళాపాళనకుండా నిద్రాదేవి ఒడిలో వాలిపోయినా అంతే! ఒంటినిండా నీరసం, గుండెనిండా నిరత్సాహం కమ్ముకుంటే,  మనిసికి పగలూ, రాత్రన్న తేడాయే ఉండదు కదా!.  తనువో,  మనసో అలసిపోయి నిద్రపటట్టడం వేరు! దేనిపైనా ఆసక్తి లేక, అవసరమైన ఏ శక్తీ, యుక్తీ లేక నిర్జీవంగా పడి ఉండడం వేరు. నిజానికి శక్తియుక్తులనేవి పుట్టీపుట్టడంతోనే ఎవరికీ  వచ్చేయవు. జ్ఞాన విజ్ఞానాలకు సంబంధించిన ఎన్నో బోధనలు వినాలి! వాటిని ఆచరించేందుకు  ఎంతో సాధన చేయాలి! అదేమీ లేకుండా, ఉన్నదే మహాసామ్రాజ్యం, కూర్చున్నదే శిఖరాగ్రం అనుకుంటే జీవితం అక్కడికక్కడే స్థంభించిపోతుంది.  నీరు పళ్లం వైపే  పరుగెత్తునట్లు,  శరీరం సహజంగా నిద్రావిరామాల్నే ఎక్కువగా కోరుకుంటుంది.  అన్ని వేళలా మనం శరీరం మాటే వింటే మనపని అధోగతే! చివరికి  మనం పడిపోతున్నామనిగానీ, పతనమైపోతున్నామని గానీ, తెలియకుండానే అన్నీ జరిగిపోతాయి. 

జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు 
అతినిద్రాలోలుడు, తెలివిలేని మూర్ఖుడు
పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు // మత్తు వదలరా //

నూరేళ్ల జీవితమని ముక్తాయింపులు ఇస్తుంటాం గానీ, దానికి ఏమిటి గ్యారెంటీ?  ఒకవేళ అనుకున్నట్టే నూరేళ్లూ  ఊపిరి సాగినా, అందులో నిజంగా బతికున్న కాలం ఏబై ఏళ్లే కదా! నిద్రా కాలం,  మేలుకున్నాక కూడా ఆ మగతనుంచి పూర్తిగా బయటపడి, కార్యరంగానికి అన్ని విధాలా సంసిద్దం కావడానికి పట్టే కాలం అదెంత?  ఆ కాలాన్నంతా మినహాయిస్తే, మిగిలేది అందులో సగం కాక ఇంకెంత? పోనీ ఆ మిగిలిన సగం కాలమైనా, ఒక లక్షం్యమంటూ ఏర్పడేదెప్పుడు? ఆ దిశగా వడివడిగా అడుగులు వేయడానికి పట్టే కాలమెంత? నిజానికి, నిన్ను బంధించిన అజ్ఞానపు సంకెళ్లు తెగిపోవడానికే జీవితంలో మేలుకున్న కాలంలోనే  మరో సగం పోతుంది. వీటికి తోడు శారీరక మానసిక ఆనారోగ్యాలూ, ప్రాకృతిక విపత్తులూ, సామాజిక కల్లోలాలు ఇవీ కొంత సమయాన్ని తినేస్తాయిగా!, అంతా పోను నీకు మిగిలింది ఎంత? నీ లక్షానికి తోడ్పడింది ఎంత? ఈ లెక్కలన్నీ వేసుకుంటే  జీవితం చాలా చాలా చిన్నదనే మహా సత్యం,  మన కళ్లముందు కొండంత ఎత్తున నిలబడుతుంది. అంతేగా మరి!

సాగినంత కాలం నా అంతవాడు లేడందురు
సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు
కండబలంతోటే ఘనకార్యము సాధించలేరు
బుద్దిబలం తోడైతే విజయమ్ము వరించగలదు // మత్తు వదలరా //

పరిస్థితులెన్నో అనుకూలించి, జీవితం సాఫీగా సాగిందే అనుకోండి, భూమ్మీద తనను మించిన వాడే  లేడనిపించవచ్చు. అలాగని జీవితమంతా అలా గడిచిపోతుందనేమీ కాదు కదా! ఒక్కోసారి పెద్ద ఉప్పెనలే వచ్చిపడతాయి. ఉన్నట్లుండి నిప్పుల వర్షమే కురుస్తుంది. వాటినుంచి కాపాడుకునే ఏర్పాట్లేవీ లేకపోతే, అప్పుడు ఆ సమయంలో తానెంత శక్తిహీనడో, ఎంత కొరగానివాడో  భూతద్దంలో కనిపిస్తుంది. కొందరిలో మరో రకం అమాయకత్వం ఉంటుంది. నాకేమిటి? రాయిలాంటి శరీరం ఉంది, సంచినిండా రాళ్లున్నాయి అని మురిసిపోతుంటారు. ఆ రాళ్లను ఎంత దూరమని విసురుతావు? ఎంత కాలం విసరుతావు? అవతలి వాడు తెలివైన వాడైతే, తన గదిలోంచి బయటికి రాకుండానే నీ గుండె గతుక్కుమనేలా చేస్తాడు అసలు నీ ఉనికే లేకుండా చేస్తాడు. అందుకే  మనిసి  వెయ్యేనుగుల బలం నింపుకోవాలి? ఆ బలంతో నువ్వు పంచే వెలుగులు వెయ్యేళ్లకు వ్యాపించేలా ఉండాలి! పుట్టిన ప్రతిదీ చచ్చేదాకా బతుకుతుంది. కానీ, చనిపోయిన తర్వాత కూడా బతికుండగలిగేది నిజానికి, మనిషొక్కడే! అలా చిరంజీవిగా బతకడమనేది ఉత్తి దేహబలంతోనే సాధ్యం కాదు, దానికి కొండంత  బుద్దిబలం కూడా కావాలి!

చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా 
పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా 
కర్తవ్యము నీ వంతు, కాపాడుట నావంతు
చెప్పడమే నాధర్మం - వినకపోతే నీ కర్మం // మత్తు వదలరా //

రాబోయే ఆపదల గురించి, వాటి పరిణామాల గురించిన అవగాహన దాదాపు అందరికీ ఎంతో కొంత ఉంటుంది. కానీ, ఆ పరిణామాలు మోసుకువచ్చే ఆ తరువాయి విపరిణామాల గురించిన అంచనా మాత్రం, ఎక్కడో  అరుదుగా తప్ప చాలా మందికి ఉండదు. నిజానికి, ఆ రెండవ దఫాగా వచ్చిపడే దాడులే మనిషిని  అమితతంగా కుంగ దీస్తాయి. అలాంటి దాడులే వెంటవెంట జరిగితే, దిక్కుతోచక మనిిషి ఒక్కోసారి  బిక్కచచ్చిపోతాడు. క్రమంగా పిరికివాడవుతాడు. నిజానికి  సంఘటనలు కాదు వాటి పరిణామాల పరిణామాలను కూడా పసిగట్టగలిగే వాడే జీవనపోరాటంలో నిలబడతాడు. వ్యూహాలకు ప్రతివ్యూహాలే కాదు, చక్రవ్యూహాలు సైతం తెలిసినవాడే విజయభేరి మోగిస్తాడు. అలాగని, ఆ జ్ఞానమంతా నీలోంచే పుడతుందని కాదు. కొంత బయటినుంచి కూడా అందుతుంది. ఎవరైనా ఆ జ్ఞానాన్ని అందించడానికి వచ్చినప్పుడు వినమ్రంగా స్వీకరించాలి. విజయసారధ్యంలో దాన్నీ భాగ ం చెయ్యాలి! ఆ అందించిన వారినీ ఆ విజయానందంలో శాశ్వత భాగస్వాములను చేయాలి!!

                                                                  - బమ్మెర

4, జనవరి 2022, మంగళవారం

‘అంజలి’ శీర్షికన ఒక ప్రైవేటు రికార్డుగా వచ్చిన కావ్య ఖండిక, | ఘంటసాల ప్రైవేట్‌ పద్యాలు |

పద్యమాధురి

‘అంజలి’ శీర్షికన ఒక ప్రైవేటు రికార్డుగా వచ్చిన కావ్య ఖండిక, రచన: ‘ కరుణశ్రీ’ జంద్యాల పాపయ్య శాసి్త్ర , స్వరకల్పన, గానం: ఘంటసాల 

ప్రేమాంజలి...!

వ్యక్తి ప్రేమలోనైనా, భగవద్భక్తిలోనైనా, నిబద్దత, నిజాయితీలకే ఎప్పుడూ సమున్నత స్థానం ఉంటూ వచ్చింది. అయినా,  లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లూ చెప్పడం ద్వారా ఎవరేం సాధిస్తారు?  ఆ మాటకొస్తే, లోకువైపోవడం తప్ప బాపుకునే భాగ్యం ఏమీ ఉండదు. నిజానికి, 'ఎవరికైనా ఏమిస్తావనేదాని కన్నా, ఎలా ఇస్తావన్నదే ఎంతో ముఖ్యమవుతుంది. కలుషితమైన మనసుతో, స్వార్థబుద్ధితో వజ్రవైఢూర్యాలను సమర్పించుకున్నా  అందులో  సార్థకత ఉండదు! నిర్మలమైన,  నిస్వార్థమైన మనసుతో పత్రీపుష్పాలు సమర్పించుకున్నా దివ్యపథం ప్రాప్తిస్తుంది.' ఇది ఆధ్మాత్మికుల  నోట ఎల్లవేళలా వినిపించే సత్యఘోష! చివరికి అర్చనలో అతి ముఖ్యమనుకునే ఆ పత్రీపుష్పాలు కూడా లేకుండాపోతే, ఏమిటి గతి? అని ప్రశ్నిస్తే, వగపెందుకు?  భక్తి పారవశ్యంలో అంజలి ఘటించే రిక్త హస్లాలే చాలు అవి భూమ్యాకాశాలను తాకే పూల కొండలు అంటారు రాజర్షులు, మహర్షులు! 

కూర్చుండ మా యింట కురిచీలు లేవు, నా 

     ప్రణయాంకమే సిద్ధపరచనుంటి

పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు, నా 

     కన్నీళ్లతో కాళ్లు కడనగనుంటి, 

పూజకై మా వీట పుష్పాలు లేవు, నా 

     ప్రేమాంజలులె సమర్పించనుంటి

నైవేద్యమిడ మాకు నారికేళము లేదు

     హృదయమే చేతికందీయనుంటి 


లోటు రానీయ నున్నంతలోన నీకు 

రమ్ము దయసేయుమాత్మ పీఠమ్ము పైకి

అమృతఝరి చిందు నీ పదాంకముల యందు

కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండి!


ఈ భక్తుడు అవి లేవు... ఇవి లేవు అంటూ ఏకరువు పెడుతున్నాడు గానీ, అవేవీ లేకపోవడమే ఒక రకంగా అతనికి  మేలయ్యంది! ఎందుకంటే,  ఇంట్టో కుర్చీలే ఉంటే, ఇంటికొచ్చిన విశ్వచక్రవర్తికి అందరిలా కుర్చీలే వేసేవాడు కదా! కుర్చీలు లేకపోవడం వల్లే ఆయనను తన ఒడిలో కూర్చోబెట్టుకునే ఆలోచన చేశాడు. అదెంత ధన్యత? దైవార్చనకు తన వద్ద పన్నీరు లేకపోతే మాత్రం ఏమయ్యింది? ఆ లేకపోవడం వల్లే,  కన్నీళ్లతో ఆయన కాళ్లు కడిగే సౌభాగ్యం అతనికి అబ్బింది! పూజ కోసం కనీసం నా వద్ద పూలైనా లేవు కదా అంటూ అతని మనసు కలత పడుతోంది గానీ, ఆ కలతే కదా పూలకు బదులుగా ప్రేమాంజలులు సమర్పించేందుకు సంసిద్ధం చేసింది! పళ్లూ, పాయసాల మాట ఎలా ఉన్నా,  నైవేధ్యం కోసం కడకు కొబ్బరికాయ అయినా లేదే .! అని అతని మనసు లోలోపల కొండశోకం పెడుతోంది కానీ, ఆ శోకమే ఆ కాయకు బదులుగా హృదయాన్నే సమర్పించుకోవడానికి ఉద్యుక్తుణ్ని చేసింది. ఎక్కడో ఏదో లేదనే భావన రాకుండా ఒకదానికి ప్రత్యామ్నాయంగా మరొకటి సమర్పించుకుంటూ, మిగతా అందరికీ సరిధీటుగా  అని కాదు, వారందరికన్నా సమున్నతుడిగా  నిలిచాడీ భక్తాగ్రేసరుడు. అందుకే ఉన్నంతలో ఎక్కడా లోటు రానీయనంటూ అంత ధీమాగా చెప్పాడు. నిజానికి అనాదిగా మానవాళిని అతలాకుతలం చేస్తున్నది తన దగ్గర ఏదో లేదనే బావనే! నిజమే భౌతిక జీవితంలో వస్తుపరమైన లోటు లోటుగానే కనిపిస్తుంది. కానీ, ఆధ్యాత్మిక జీవనంలో ఆ లోటు లోటే కాదు! విశ్వంలోని అణువణువునా జీవిస్తున్న సర్వేశ్వరుడికి అన్నీ ఒకటే కదా!

ఏదో లేని కారణంగా మనమింక నిలబడలేమేమో, ఎక్కడ  పాతాళానికి జారిపోతామో అని చాలా సార్లు  కొందరు  బెంబేలెత్తి పోతుంటారు,  కానీ ఆ లేని తనమే ఒక్కోసారి అంతకు ముందెప్పుడూ కలగని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది. అదే వారిని ఆకాశానికి చేరుస్తుంది. అనంతమైన ఆధ్యాత్మికానందానికి పాత్రుల్ని చేస్తుంది. చరితార్థుల్ని చేస్తుంది! కాకపోతే, ఆ శిఖరాన్ని అందుకోవడానికి సిరిసంపదల కన్నా కోటి రెట్లు  విలువైన జ్ఞాన సంపన్నత కావాలి! ఆ సంపన్నత ఒకటీ రెండూ కాదు  కోటి స్వర్గాల్ని నీ ముందు నిలబెడుతుంది !! ఇది  తపోధనుల, జ్ఞానర్షుల దివ్యవాక్కు!!!

                                                                - బమ్మెర