14, ఆగస్టు 2021, శనివారం

భారతీయుల కళాప్రాభవమ్మొలికించి పద్యం | సరోజినీ నాయడు గురించి ఘంటసాల పాడిన పద్యం | తెలుగు పద్యాలు |

 పద్యమాధురి

‘ఇండియన్‌ నైటింగేల్‌ ’ లేదా ‘భారత కోకిల ’ అన్న మాటలు ఎక్కడ విన్నా,  మనముందు ఒక పరిపూర్ణ వ్యక్తిత్వంతో విరాజిల్లే సరోజినీ నాయడు రూపం కళ్లముందు నిలుస్తుంది.  స్వాతంత్య్ర సమర శంఖం ఊదడంలో ముందు వరుసలో నిలిచిన వీరవణిత ఆమె. బారతీయ కళావైభవాన్నీ, ప్రాక్పశ్చిమాల మధ్యగల అభేదత్వాన్ని చాటి చెప్పిన ఆమె అద్భుతమైన స్వరం ఆ రోజుల్లో నిజంగా ప్రపంచమంతా మారు మ్రోగింది. కన్నవారి మూలాలు బెంగాళ్‌లో ఉన్నా ఆమె పుట్టీ పెరిగింది తెలుగునేల పైనే. ఇక్కడ పుట్టడమే కాదు,  తెలుగు వ్యక్తినే పెళ్లాడి, తెలుగింటి కోడలయ్యింది.  1925లో ఆమె  ఇండియన్‌ నేష్నల్‌ కాంగ్రెస్‌కు మొదటి మహిళా అద్యక్షురాలిగా ఎన్నికయ్యింది. స్వాత్రంత్య్రపోరాటంలో ఆమె చేసిన కావ్యాత్మక ప్రసంగాలు ఎంతో మంది యువతీ యువకులు సమర రంగంలో దూకేలా చేశాయి. భారత దేశ ఔన్నత్యాన్ని పాశ్చాత్యులకు వివరించి,  ఈ దేశ సంస్కృతి పట్ల వారికి సదవగాహన కలిగేలా చేయడంలో ఆమె ఒక అద్వితీయమైన భూమికను పోషించింది. దేశ స్వాతంత్య్రం కోసం  దాదాపు 50 ఏళ్లపాటు అలుపెరుగని పోరాటం చేసిన సరోజినీ నాయడు గురించి తోలేటి వెంకటరెడ్డి రాయగా,  స్వీయ సంగీతదర్శకత్వంలో ఘంటసాల పాడిన ఈ పద్యం ఒక ప్రైవేటు రికార్డుగా విడుదలైంది.


భారతీయుల కళాప్రాభవమ్మొలికించి

          తీయగా పాడిన కోయిలమ్మ

కమనీయ వంగ వంగడమెల్ల మూర్తిలో

           ప్రసరించినట్టి మేల్‌ పసిడిబొమ్మ

స్వారాజ్య వీర విహార రంగములోన  

           కోరి దూకిన తెన్గు కోడలమ్మ 

మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి

           చేయెత్తి చూపిన చెల్లెలమ్మ 

ప్రాక్పశ్చిమాలు విస్ఫారించి, ప్రేమింప 

           పాఠాలు నేర్పిన పంతులమ్మ 


భరతనారీ ప్రతాప ప్రభావ గరిమ

ఖండ ఖండాలు జల్లి విఖ్యాతిగన్న

దివ్యమూర్తి సరోజినిదేవి వోలె 

దీక్షసూత్రాన ఆ దేవి దివ్య సుగుణ

పుష్పముల నేరి విరిదండ పూర్తి చేసి 

పుణ్య భారత మాతను పూజచేసి

ఘనతకెక్కుడి భారత వనితలార ! 

గుండెలో ఎంతటి భావోద్వేగమైనా ఉండవచ్చు. అద్భుతమైన భాషే లేకపోతే, అది చేరవలసిన వాళ్లకు చేరదు. జాజ్వల్యమానమైన తన కవితాత్మక భాషతో భారతీయ కళా ప్రాభవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన ప్రతిభామూర్తి సరోజినీ నాయుడు. దేశవిదేశాల్లో ఆమె చేసిన ప్రసంగాలు,  ఆమె గానం చేసిన దేశభక్తి గీతాలు, ఆమెకు ‘భారత కోకి ల’ అన్న  బిరుదు రావడానికి కారణభూతమయ్యియి. ఇంతకూ భారతీయ కళాసృష్టికి విశ్వవ్యాప్తంగా  అంత కీర్తి ప్రతిష్టలు రావడానికి గల కారణమేమిటి? కళల పట్ల ఈ దేశపు తాత్విక మూలాలే అందుకు ప్రదాన కారణం. ‘‘సృష్ట్యాధిలో విశ్వ ఆవిర్భావం పూర్తిగా జరగలేదు. కొంత జరిగి, మిగతాదంతా సృజనకారుల హృదయాలకు వదిలేయబడింది’’’ అన్న ఈ ఒక్కమాట భారతదేశం కళాత్మకత కు ఎంత పెద్ద పీఠ వేసిందో విషదమవుతుంది. జీవితమే ఒక అనంతమైన కవితా వస్తువనీ, అది  నిరంతరం తనను తాను బహుముఖంగా ఆవిష్కరించుకుంటూ ఉంటుందని భారతీయ కళావేత్తలు చెబుతారు.  భారత హృదయంలోని ఈ అవ్యాజమైన ప్రేమే కళను జీవిత మహా ఐశ్వర్యంగా  భావించేలా చేసింది.  ప్రాక్పశ్చిమాల ప్రస్తావన వచ్చినప్పుడు భిన్నత్వం అనేది భాహ్యంగా కనిపించేదే కానీ, మూలాల్లో అదేమీ లేదని ఆమె నొక్కి చెప్పింది.  

సౌందర్యశాస్త్ర  చర్చల్లో సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యమన్న దేశీయ కళాదృక్పధాన్ని ఉద్ఘాటించింది. మానవ హృదయం,  అల్పమైన విషయాలకు అతీతంగా అత్యంత లోతైన అర్థాన్ని ఆవిష్కరించేందుకు, లోలోపల దాగి ఉన్న అత్యంత సున్నితత్వాన్ని బహిర్గతం చేసేందుకు వేదిక కావాలని చెబుతూ ఉండేది. ఈ సున్నితత్వం మనిషిని  అహింసామార్గం వైపు నడిపిస్తుందని సరోజినీ నాయుడు  బలంగా నమ్మేది. వనితలే అని కాదు,  సమస్త మానవాళీ ఈ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన ఆమె నుంచి స్పూర్తి పొందాలి. ఆమె మూర్తిమత్వానికి చేతులెత్తి సమస్కరించాలి!!

                                                            - బమ్మెర 

==================================









4 కామెంట్‌లు:

  1. అద్భుతమైన వ్యాఖ్యానం బమ్మెర వారు. స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు
    ఆచార్య పిల్లలమఱ్ఱి రాములు

    రిప్లయితొలగించండి
  2. పాట ఎంత మధురంగా ఉందో, మీ వ్యాఖ్యానం కూడా అంత మధురంగా ఉందండి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. the finest patriot song by Sri Ghantasala garu

    రిప్లయితొలగించండి